కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అసాధారణ బ్యాటింగ్తో పాటు ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన పోరాటంతో ఓటమి తప్పించుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ను టీమిండియా డ్రా చేసుకుంది.
ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్లో వర్షంతో పాటు టెయిలెండర్ల అసాధారణ బ్యాటింగ్ టీమిండియాను గట్టెక్కించింది. దాంతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్ట్ అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన రోహిత్ శర్మ.. ఓటమి తప్పించిన ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. పదే పదే వర్షం అంతరాయం కలిగించడం చికాకు పెట్టిందన్నాడు.

'పదే పదే వర్షం అంతరాయం కలిగించడం చికాకు పెట్టింది. కానీ ఈ మ్యాచ్లో ఓటమి తప్పించుకొని 1-1తో మెల్ బోర్న్ వెళ్లడం గొప్ప విషయం. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మెల్బోర్న్లో రాణించగలమనే విశ్వాసాన్ని ఇచ్చింది. నాలుగో రోజు ఆటలో లంచ్ తర్వాత మాలో ఎవరైనా నిలబడి గేమ్ను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. వాతావరణాన్ని మదిలో పెట్టుకొని ఆడాలనుకున్నాం. వర్షం కారణంగా గేమ్ పూర్తిగా జరగదని మాకు తెలుసు.
ఈ మ్యాచ్ డ్రా.. క్రెడిట్ జడేజా, రాహుల్దే. ఈ ఇద్దరి బ్యాటింగ్ అద్భుతం. వీరి ఆట చూడ మచ్చటగా అనిపించింది. బౌలింగ్లోనూ మేం అద్భుతంగా రాణించాం. ముఖ్యంగా బుమ్రా దుమ్ములేపాడు. ఆకాశ్ దీప్ది విభిన్నమైన పాత్ర. అతనిలో చాలా ప్రతిభ ఉంది. అంతర్జాతీయ క్రికెట్కు అతను కొత్త. కానీ ఇలాంటి మ్యాచ్లు అతనికి ఎంతో అనుభవాన్నిస్తాయి. అతనికి అండగా నిలిచి వెన్నుతట్టే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమిండియా 260 పరుగులకు ఆలౌటైంది. 185 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్యచేధనకు టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 8/0తో నిలిచింది. వర్షం తీవ్రత పెరగడంతో అంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు.