టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్రను లిఖించాడు. నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ ఈ అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నాడు. మరే ఆటగాడు కూడా ఇప్పటి వరకు నాలుగు ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్గా ఫైనల్ చేరలేదు.
ఒకే ఒక్కడు..
రోహిత్ శర్మ సారథిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ ఆడాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లోనూ ఆసీస్.. రోహిత్ సారథ్యంలోని టీమిండియాను ఓడించింది. గతేడాది రోహిత్ సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచింది. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హిట్ మ్యాన్ కెప్టెన్సీలోనే ఫైనల్ చేరింది. దాంతోనే నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరిన కెప్టెన్గా రోహిత్ అరుదైన ఘనతను అందుకున్నాడు.

కోహ్లీ, ధోనీకి సాధ్యం కాలేదు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచాడు. అయితే అతని హయాంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదు. 2019-21 ఎడిషన్ నుంచే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తోంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019-21 ఫైనల్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ మాత్రమే ఆడింది. వన్డే ప్రపంచకప్ 2019తో పాటు టీ20 ప్రపంచకప్ 2016లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా సెమీస్లోనే వెనుదిరిగింది.
గేల్ రికార్డ్ బద్దలు.
ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గానూ రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. ఈ మ్యాచ్లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా రోహిత్ శర్మ అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్ శర్మకు ఇది 65వ సిక్స్. దాంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న 64 సిక్స్ల రికార్డ్ను రోహిత్ అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(65), క్రిస్ గేల్(64) తర్వాత గ్లేన్ మ్యాక్స్వెల్(49), డేవిడ్ మిల్లర్(45), డేవిడ్ వార్నర్(42), సౌరవ్ గంగూలీ(42) ఉన్నారు.