
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనం కోల్పోయాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్పై కోపాన్ని తన బ్యాట్పై ప్రదర్శించాడు. చేతితో బ్యాట్ను బలంగా గుద్దుతూ డీఆర్ఎస్ కోరాడు. శుక్రవారం తొలి రోజు ఆట చివర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
భారత ఇన్నింగ్స్ సందర్భంగా నాథన్ లియోన్ వేసిన చివరి ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నం చేయగా.. ప్యాడ్లను తాకిన బంతి షార్ట్ లెగ్ ఫీల్డర్ చేతిలో పడింది. దాంతో ఆసీస్ ఆటగాళ్లు వికెట్ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. రోహిత్ గ్లోవ్స్కు బంతి తాకినట్లు భావించిన ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దాంతో అసహనానికి గురైన రోహిత్.. ఏం అంపైరింగ్ చేస్తావ్రా? అయ్యా అని గట్టిగా అరుస్తూ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూ సిగ్నల్ ఇచ్చే సమయంలో బ్యాట్ను గట్టిగా గుద్దుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖవాజా(125 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 81), పీటర్ హాండ్స్కోంబ్(142 బంతుల్లో 9 ఫోర్లతో 72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(4/60) నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్(3/57), రవీంద్ర జడేజా(3/68) మూడేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(13 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(4 బ్యాటింగ్) ఉన్నారు.