టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ ఈ ఇద్దరూ స్టార్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు అండగా నిలవాల్సిన సీనియర్ బ్యాటర్లు పేలవ బ్యాటింగ్తో చేతులెత్తేశారు.
ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో రోహిత్ శర్మ(40 బంతుల్లో 9) స్లిప్ క్యాచ్గా వెనుదిరగ్గా.. విరాట్ కోహ్లీ మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకే ఔటయ్యాడు. స్టార్ బౌలింగ్లో ఐదో స్టంప్ లైన్ బంతిని వెంటాడి పెవిలియన్ చేరాడు. సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్(0) కూడా విఫలమవ్వడంతో టీమిండియా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్(31 బ్యాటింగ్), రిషభ్ పంత్(4 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలమవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ టైమ్ అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని కామెంట్ చేస్తున్నారు. ఈ సిరీస్లో ఈ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రోహిత్ శర్మ అయితే అటు కెప్టెన్గా కూడా తడబడుతున్నాడు.
15 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ..
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఆ సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా న్యూజిలాండ్తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులు చేశాడు.
ఆసీస్ పర్యటనలో తొలి టెస్ట్కు రోహిత్ దూరంగా ఉండగా.. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచ్కు అతను అందుబాటులోకి రాగా.. భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో రోహిత్ 3, 6 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడో టెస్ట్లో 10 పరుగులే చేసిన రోహిత్.. తాజా మ్యాచ్లో3, 9 రన్సే చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
17 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక్క సెంచరీ..
విరాట్ కోహ్లీ సైతం గత 17 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక్క సెంచరీ, మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తన బ్యాటింగ్ శైలికి సెట్ అయ్యే టెస్ట్ ఫార్మాట్లో కోహ్లీ తడబడుతున్నాడు. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ డెలివరీ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు.
తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో ఈ పర్యటనను ఘనంగా ప్రారంభించిన కోహ్లీ.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. పింక్ బాట్ టెస్ట్లో 7, 11 పరుగులే చేసిన కోహ్లీ.. గబ్బాలో 3 పరుగులకే వెనుదిరిగాడు. తాజా మ్యాచ్లో 36, 5 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కూడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.