
ఇండోర్: 'ఒక్క దెబ్బకు మూడు పిట్టలు'అనే సామెత టీమిండియాకు సరిగ్గా సరిపోతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు సువర్ణవకాశం దక్కింది. ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమయ్యే మూడో టెస్ట్లో టీమిండియా విజయం సాధిస్తే మూడు లక్ష్యాలు నెరవేరనున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే రెండు విజయాలతో సిరీస్ను రిటైన్ చేసుకున్న రోహిత్.. ఇండోర్లో విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంటుంది.
ఇక సిరీస్ విజయంతో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-0, 3-0, 3-1 తేడాతో గెలవాలి. అంటే చివరి రెండు మ్యాచ్ల్లో ఏమాత్రం ఓడిపోకూడదు. ఈ క్రమంలోనే ఇండోర్ టెస్ట్కు ప్రాధాన్యత సంతరించుకుంది. చివరి రెండు మ్యాచ్ల్లో ఓడితే శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ సిరీస్ను శ్రీలంక 2-0తో గెలిస్తే టీమిండియా ఫైనల్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఇండోర్ టెస్ట్ గెలిచి టెన్షన్ లేకుండా ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇండోర్ టెస్ట్ విజయంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానాన్ని అందుకోనుంది. అయితే ఈ ర్యాంక్ను నిలబెట్టుకోవాలంటే చివరి టెస్ట్ను కూడా టీమిండియా గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇరు జట్లు ఇండోర్ చేరి ముమ్మరంగా సాధన చేశాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ నెట్స్లో చెమటోడ్చారు. టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్కు అవకాశం ఇస్తారా? లేక శుభ్మన్ గిల్ ఆడిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రోహిత్ మాత్రం.. రాహుల్కే మద్దతు ఇస్తున్నట్లు హింట్ ఇచ్చాడు.