టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర తప్పిదం చేశాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో కీలకమైన క్యాచ్ను వదిలేసాడు. పంత్ తప్పిదం కారణంగా ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్స్వీనీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఈ క్యాచ్ను పంత్ పట్టి ఉంటే తొలి రోజు ఆటలో ఆసీస్ మరో 2 వికెట్లు కోల్పోయేది. కానీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న నాథన్ మెక్స్వీనీ జిడ్డు బ్యాటింగ్తో ఆసీస్ ఇన్నింగ్స్కు అడ్డుగోడలా నిలిచాడు. 97 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లతో 38 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ల్లో మెక్స్వీని బుమ్రా బౌలింగ్లోనే వెనుదిరిగాడు. తాజా మ్యాచ్లోనూ మెక్స్వీని బుమ్రా బౌలింగ్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అతని వేసిన 6వ ఓవర్ మూడో బంతి మెక్స్వీన్ బ్యాట్ ఎడ్జ్ తాకి ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. రిషభ్ పంత్ డైవ్ చేసి బంతిని అందుకే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చిక్కలేదు.
పంత్ ప్రయత్నించకుంటే రోహిత్ శర్మ సునాయసంగా ఈ క్యాచ్ అందుకునేవాడు. ఈ క్యాచ్ నేలపాలవ్వడంపై బుమ్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
బుమ్రా బౌలింగ్లో రిషభ్ పంత్ తడబడటం ఇదే తొలిసారి కాదు. ఇప్పటి వరకు రిషభ్ పంత్.. బుమ్రా బౌలింగ్లో 42 క్యాచ్ల్లో 8 నేలపాలు చేశాడు. 34 సార్లు మాత్రం క్యాచ్ అందుకున్నాడు. ఇతర ఫాస్ట్ బౌలర్లలో 132 క్యాచ్ల్లో 10 మాత్రమే వదిలిపెట్టాడు. అయితే బుమ్రా బౌలింగ్ను అంచనా వేయడంలో వికెట్ కీపర్గా పంత్ తడబడుతున్నాడు. ఈ విషయంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని క్రికెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42) దూకుడుగా ఆడగా.. కేఎల్ రాహుల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 37), శుభ్మన్ గిల్(51 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/48) ఆరు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(13) విఫలమైనా.. నాథన్ మెక్స్వీనీ(97 బంతుల్లో 6 ఫోర్లతో 38 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(67 బంతుల్లో 3 ఫోర్లతో 20 బ్యాటింగ్) జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో నిలబడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకే ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది.