టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే 2000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి వికెట్ కీపర్గా రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి మ్యాచ్లో రిషభ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో పంత్ 78 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లతో పాటు ఓ సిక్స్ ఉంది. ఈ పరుగులతో కలుపుకొని రిషభ్ పంత్.. డబ్ల్యూటీసీలో ప్రస్తుతం 2034 పరుగులతో నిలిచాడు. దాంతో డబ్ల్యూటీసీ చరిత్రలోనే 2వేల పరుగుల మైలురాయి ధాటిన తొలి వికెట్ కీపర్గా గుర్తింపు పొందాడు.

ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఓలీ పోప్, న్యూజిలాండ్కు చెందిన టామ్ లాథమ్ ఇప్పటికే 2000 పరుగులు పూర్తి చేసినా.. వీరు ఎక్కువగా వికెట్ కీపింగ్ చేయలేదు. ఓలీపోప్ 4 ఇన్నింగ్స్ల్లో.. టామ్ లాథమ్ ఒకే ఒక్క ఇన్నింగ్స్లో వికెట్ కీపింగ్ చేశాడు. 2019లో ప్రారంభమైన డబ్ల్యూటీసీ ఇప్పటి వరకు రెండు ఎడిషన్లు(2019-21, 2021-23) సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. 2023-25 మూడో ఎడిషన్ తుది దశకు చేరుకుంది.
ఇక డబ్ల్యూటీసీ చరిత్రలో 2000 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్గా రిషభ్ పంత్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(2685), విరాట్ కోహ్లీ(2432).. రిషభ్ పంత్(2034) కంటే ముందున్నారు. తర్వాతి స్థానాల్లో శుభ్మన్ గిల్(1800), చతేశ్వర్ పుజారా(1769) కొనసాగుతున్నారు.
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియానే పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్లో విఫలమైనా.. బౌలింగ్లో సత్తా చాటింది. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(4/17), మహమ్మద్ సిరాజ్(2/17), హర్షిత్ రాణా(1/33) నిప్పులు చెరగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 27 ఓవర్లలో 7 వికెట్లకు 67 పరుగులే చేసింది. క్రీజులో మిచెల్ స్టార్క్(6 బ్యాటింగ్)తో పాటు అలెక్స్ క్యారీ(19 బ్యాటింగ్) ఉన్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, అరంగేట్ర ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/29) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(2/14), ప్యాట్ కమిన్స్(2/67), మిచెల్ మార్ష్(2/12) రెండేసి వికెట్లు పడగొట్టారు.