IND vs AUS: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32) పర్వాలేదనిపించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(3/40) మూడు వికెట్లు తీయగా.. జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీకి ఓ వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ.. పవర్ ప్లేలోనే 50 పరుగులు చేసింది. కానీ దూకుడుగా ఆడుతున్న యశస్వీ జైస్వాల్ను ఆరోన్ హార్డీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(8), సూర్యకుమార్ యాదవ్(1) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దాంతో 63 పరుగులకే టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్తో ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన రుతురాజ్ గైక్వాడ్(32)ను తన్వీర్ సంఘా ఔట్ చేయడంతో టీమిండియా స్కోర్ బోర్డు మరింత నెమ్మదించింది.
ఈ పరిస్థితుల్లో జితేశ్ శర్మ సాయంతో రింకూ సింగ్ తనదైన శైలిలో చెలరేగాడు. 3 సిక్సర్లతో పాటు బౌండరీతో ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన జితేశ్ శర్మ(35) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ సైతం మరుసటి బంతికే భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. దాంతో 19వ ఓవర్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్ తొలి బంతికే రింకూ సింగ్ ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా సాధారణ స్కోర్కే పరిమితమైంది.