
నాగ్పూర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొరడా ఝులిపించింది. ఓ డీమెరిట్ పాయింట్తో పాటు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్ సందర్భంగా అంపైర్ల అనుమతి లేకుండా చేతికి ఆయింట్మెంట్ పూసుకున్నందుకు చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై రవీంద్ర జడేజా ఇచ్చిన వివరణకు ఐసీసీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో అతన్ని మందలిస్తూ స్వల్ప జరిమానాతో సరిపెట్టింది.
బంతి ఆకారాన్ని దెబ్బతీసేందుకు జడేజా ప్రయత్నం చేయలేదని, ఆయింట్మెంట్ను అందుకు ఉపయోగించలేదని స్పష్టం చేసింది. అంపైర్ల అనుమతి లేకుండా ఆయిమెంట్ వాడినందుకే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని పేర్కొంది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 46వ ఓవర్ ముందు రవీంద్ర జడేజా.. తన వేలికి ఆయింట్మెంట్ పూసుకున్నాడు. ఇది టీవీ కెమెరాల్లో రికార్డవ్వగా.. అతను బాల్ ట్యాంపరింగ్ చేశాడని ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు ఆరోపణలు గుప్పించారు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆసీస్ మాజీ కెప్టెన్ టీమ్ పైన్ 'జడేజా తన వేలికి ఏం పూసుకున్నాడు? ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు' అని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలతో షాక్ అయిన భారత మీడియా ఆ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. చేతి వేలు నొప్పిపెట్టడంతో ఆయింట్మెంట్ రాసుకున్నాడని వివరణ ఇచ్చింది. దాంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశం కాగా.. అంపైర్ల సమక్షంలో జడేజా ఆయింట్మెంట్ రాసుకోవాల్సిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఐసీసీ.. జడేజా బాల్ ట్యాంపరింగ్కు ప్రయత్నించలేదని చెబుతూనే.. చర్యలు తీసుకొంది. ఏడాదిలో మరో రెండు డిమేరిట్ పాయింట్లు వస్తే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(25 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(5/37) ఐదు వికెట్ల ఘనత అందుకోగా.. జడేజా(2/34), మహమ్మద్ షమీ(2/13) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.