
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 250 వికెట్ల మైలురాయిని అందుకున్న జడేజా.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్తో పాటు ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్ హడ్లీ, షాన్ పొలాక్ల రికార్డులను అధిగమించాడు.
టెస్ట్ ఫార్మాట్లో 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఇయాన్ బోతామ్ 55 మ్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా(62), కపిల్ దేవ్(65), హడ్లీ(70), షాన్ పొలాక్(71), రవిచంద్రన్ అశ్విన్(75) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ల్లో ఇప్పటి వరకు 37 యావరేజ్తో 2593 పరుగులు చేసిన జడేజా.. ఉస్మాన్ ఖవాజా వికెట్తో 250వ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు.
తొలి టెస్ట్లోనే ఈ మైలురాయి కోసం జడేజా తనను ఇబ్బంది పెట్టాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఐదు వికెట్ల ఘనత కోసం అశ్విన్.. 250 వికెట్ కోసం జడేజా.. టెయిలెండర్లను ఔట్ చేస్తానని షమీ బంతి కోసం తనను ఇబ్బంది పెట్టారని వెల్లడించాడు. దాంతో తొలి టెస్ట్లో ఈ ఘనతను చేజార్చుకున్న జడేజా.. రెండో టెస్ట్ తొలి సెషన్లోనే ఉస్మాన్ ఖవాజాను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. కానీ అతను రివ్యూ తీసుకోగా.. బంతి ఔట్సైడ్ పిచ్ అయినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. అయితే లంచ్ బ్రేక్ అనంతరం ఎట్టకేలకు ఖవాజా ఇన్నింగ్స్కు జడేజా తెరదించాడు.
కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో ఖవాజాను ఔట్ చేసి 250వ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. 227 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(125 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 81) ఒక్కడే రాణించగా.. డేవిడ్ వార్నర్(15), మార్నస్ లబుషేన్(18), స్టీవ్ స్మిత్(0), ట్రావిస్ హెడ్ (12), అలెక్స్ క్యారీ(0) దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(33)తో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్(55 బ్యాటింగ్) ఏడో వికెట్కు 60 పరుగులు జోడించాడు. ప్రమాదకరంగా మారిని ఈ జోడీని జడేజా విడదీసాడు. టాడ్ మర్ఫీ(0) డకౌటవ్వగా.. క్రీజులోకి వచ్చిన నాథన్ లియోన్తో హ్యాండ్స్కోంబ్ ఆడుతున్నాడు.