ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్ట్లో టీమిండియా ఓపెనర్గా రోహిత్ శర్మనే ఆడించాలని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. రోహిత్ శర్మకు మిడిలార్డర్లో కంటే ఓపెనర్గానే మెరుగైన రికార్డ్ ఉందని చెప్పాడు.
వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ తొలి టెస్ట్కు దూరం కాగా.. కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. యశస్వి జైస్వాల్తో కలిసి అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దాంతో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్తో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇచ్చినా.. కేఎల్ రాహుల్నే ఓపెనర్గా కొనసాగించారు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. మరోవైపు రాహుల్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు.

శనివారం నుంచి గబ్బా వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మను ఓపెనర్గా ఆడించాలని రవి శాస్త్రి సూచించాడు. 'గత 8, 9 ఏళ్లుగా రోహిత్ శర్మ ఓపెనర్గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఓపెనర్గానే రోహిత్ రాణించగలడు. అదే అతనికి సరైన ప్లేస్. అటాకింగ్ గేమ్తో జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందిస్తాడు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
రవి శాస్త్రి హెడ్ కోచ్గా ఉన్నప్పుడే టెస్ట్ల్లో రోహిత్ శర్మ ఓపెనర్గా ప్రమోషన్ అందుకున్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన తర్వాత రోహిత్ టెస్ట్ల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
ఓపెనర్గా 2019-24 మధ్య 64 టెస్ట్ ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ 2659 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 212. మిడిలార్డర్లో 47 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో 1585 పరుగులు చేశాడు.ఈ గణంకాల నేపథ్యంలోనే రవి శాస్త్రి.. రోహిత్ శర్మను ఓపెనర్గా ఆడించాలని సూచించాడు.
ఇదే రవి శాస్త్రి పింక్ బాల్ టెస్ట్కు ముందు కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ఆడించాలని చెప్పాడు. ఆ మ్యాచ్లో భారత్ ఓటమి పాలవ్వడంతో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. మూడో టెస్ట్లో రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది.