ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్పై పట్టు సాధించాలంటే ఇరు జట్లకు నాలుగో టెస్ట్ గెలవడం కీలకం.
ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు సిద్దమవుతున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్ కోసం అత్యంత వేగవంతమైన పిచ్ను సిద్దం చేశారు. దాంతో ఈ మ్యాచ్లో భారత జట్టుకు కఠిన సవాల్ తప్పదని ఆసీస్ మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత మాజీ ఆటగాళ్లు మాత్రం ఈ మ్యాచ్లో భారత్ గెలుస్తోందని, గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో విజయం సాధించిందని గుర్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెల్ బోర్న్ టెస్ట్లో గెలిచే జట్టు ఏదో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అంచనా వేసారు. భారత జట్టు గెలుస్తుందని జోస్యం చెప్పారు. 'ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. భారత జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ గెలుచుకునే అవకాశాలు దక్కుతాయి. పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ టెస్ట్ల తర్వాత ఏదైన విదేశీ జట్టు సిరీస్లో సమంగా నిలిస్తే.. మిగతా మ్యాచ్లు గెలుచుకోవడం సులువవుతోంది. గత పర్యటనలోనూ భారత జైత్రయాత్ర మెల్ బోర్న్ నుంచే మొదలైంది. అయితే ఇరు జట్ల మధ్య మాత్రం హోరాహోరీ పోరు ఉంటుంది. రెండు జట్లు ఈ సిరీస్లో అద్భుతంగా ఆడుతున్నాయి.
అయితే ఆస్ట్రేలియా టాపార్డర్ తడబడుతోంది. ఇలా ఆసీస్ టాపార్డర్ తడబడటం చూసి చాలా కాలం అయ్యింది. ఆసీస్ బలహీనతపై భారత్ దెబ్బకొట్టాలి. యువ ప్లేయర్ సామ్ కోన్స్టాస్ జట్టులోకి రావడం ఆసీస్కు కలిసొచ్చే అంశం. అతను మంచి నైపుణ్యం కలిగిన ఆటగాడు. అయితే టెస్ట్ క్రికెట్లో టెక్నిక్ ఉంటేనే రాణించగలం. ఈ సిరీస్లో సామ్ కోన్స్టాస్ రాణిస్తే.. భవిష్యత్తు స్టార్గా ఎదుగుతాడు.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.