
రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి..
అయితే నాగ్పూర్ టెస్ట్ కోసం సిద్దం చేసిన పిచ్పై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి 72 గంటల ముందు పిచ్ను మార్చాలని క్యూరేటర్ను ద్రవిడ్ కోరినట్లు జాగరన్ వెబ్సైట్ పేర్కొంది. గత రెండు, మూడు రోజులుగా భారత జట్టు తొలి టెస్ట్ జరగనున్న వీసీఏ స్డేడియం సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేసింది. ఉన్నట్టుండి ద్రవిడ్ మ్యాచ్ ప్రారంభానికి మూడు రోజుల ముందు పిచ్ మార్చాలని కోరడంతో అధికారులు, క్యూరేటర్స్ రాత్రి, పగలు కొత్త పిచ్ను సిద్దం చేయడం కోసం శ్రమిస్తున్నారని తెలుస్తోంది. పిచ్ను మార్చితే సైట్ స్క్రీన్స్ను కూడా దానికి తగ్గట్లు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం..
వాస్తవానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లకు అనుకూలంగా ఉండే పిచ్లను సిద్దం చేసి.. ఐదు రోజుల పాటు మ్యాచ్ సాగే వికెట్లను రూపొందించాలని నిర్ణయించారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ కోరిక మేరకు టర్నర్ వికెట్స్ను తయారు చేస్తున్నారు. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం కీలకం కావడంతో అనుకూలంగా ఉండే పిచ్లు రూపొందించడంపై ఫోకస్ పెట్టారు. సొంతగడ్డపై ఉండే అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటూ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ల్లో ఆడాలని టీమిండియా భావిస్తుంది.

అడ్వాంటేజ్ను వాడుకోవాలనే..
ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మీడియా ఇప్పటికే పిచ్లపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాగ్పూర్ టెస్ట్లో తొలి రోజు నుంచే బంతి టర్న్ అవ్వనుంది. తమకు ఉన్న నలుగురు స్పిన్నర్లతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్పై టీమిండియా కన్నేసింది. గత కొన్నేళ్లుగా సొంతగడ్డపై టీమిండియా టర్నింగ్ ట్రాక్ల్లోనే ఆడి విజయాలందుకుంది.

అప్పుడు అట్టర్ ఫ్లాఫ్..
అయితే 2004లో ఇదే నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో సౌరవ్ గంగూలీ ఇలానే టర్నర్ వికెట్ కోసం పట్టుబట్టి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ మ్యాచ్లో ఆసీస్ 342 పరుగులతో గెలుపొందింది. ఇటీవల ద్రవిడ్ కూడా న్యూజిలాండ్తో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో చివరి నిమిషంలో పిచ్ను మార్చమని కోరగా.. వికెట్ పూర్తిగా స్పిన్కు అనుకూలంగా మారి వివాదాస్పదమైంది. ఇప్పుడు నాగ్పూర్ టెస్ట్లోనూ పిచ్ మార్చుతుండటంతో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించనున్నారు.


Click it and Unblock the Notifications












