
న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫిట్గా ఉంటే ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ ఆడుతాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. అయ్యర్ విషయంలో మరో నిర్ణయం లేదని చెప్పాడు. వెన్ను గాయంతో తొలి టెస్ట్కు దూరమైన శ్రేయస్ అయ్యర్.. పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరాడు. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొన్నాడు. నెట్స్లో గంటలకొద్ది బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గురువారం ప్రాక్టీస్ సెషన్లో అయ్యర్ ఆట తీరును చూసిన తర్వాత అతను ఐదు రోజుల గేమ్ ఆడగలడనే నమ్మకం కుదిరితే తుది జట్టులో చోటు కల్పిస్తామని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.
రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రాహుల్.. టీమ్ మార్పులపై హింట్ ఇచ్చాడు. 'గాయపడ్డ ఆటగాళ్లు పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి రావడం గొప్ప విషయం. గాయాలతో ఆటగాళ్లను దూరం చేసుకోవాలని మేం అనుకోవడం లేదు. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం మంచి విషయం. రెండు రోజుల ట్రైనింగ్ సెషన్ అనంతరం అతన్ని ఆడించేదానిపై నిర్ణయం తీసుకుంటాం. ఈ రోజు అతను లాంగ్ సెషన్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. రేపు కూడా అతని ట్రైనింగ్ను నిశితంగా పరిశీలిస్తాం. అతను మ్యాచ్ ఆడే ఫిట్నెస్ సాధిస్తే మరో సందేహం లేకుండా జట్టులోకి తీసుకుంటాం.
శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడగలడు. అంతకంటే అతని టెంపర్మెంట్ జట్టుకు ఎంతో అవసరం. అరంగేట్ర మ్యాచ్ నుంచి శ్రేయస్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిషభ్ పంత్, జడేజాలతో కలిసి అద్భుతమై ఇన్నింగ్స్లతో జట్టును గట్టెక్కించాడు. అతను జట్టులోకి తిరిగిరావడం శుభసూచకం. మెరుగైన ప్రదర్శనతో జట్టుకు మేలు చేసిన ఆటగాళ్లకు మేం విలువనిస్తాం. గాయాలతో దూరమైనా.. ఆ సమయంలో ఏం జరిగినా వారికే తొలి ప్రాధాన్యం ఇస్తాం.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లందరూ చెమటోడ్చారు. ముఖ్యంగా గాయంతో తొలి టెస్ట్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ జట్టుతో చేరి ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. కొద్దిసేపు ఫుట్బాల్ ఆడాడు. మిగతా ఆటగాళ్లంతా వామప్తో పాటు కొంత సేపు ఫీల్డింగ్ కోచ్ పర్యవేక్షణలో క్యాచ్లు ప్రాక్టీస్ చేశారు. శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వస్తే సూర్యకుమార్ యాదవ్ బెంచ్కే పరిమితం కానున్నాడు.