
నాగ్పూర్: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో ద్రవిడ్ ఇచ్చిన రియాక్షన్కు సంబంధించిన ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తుంటున్నారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఇందిరా నగర్ గుండా అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లో గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఉస్మాన్ ఖవాజా వికెట్ల ముందు దొరికిపోగా.. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. దాంతో రివ్యూకెళ్లిన టీమిండియా ఫలితాన్ని రాబట్టింది. ఈ ఘటనను డ్రెస్సింగ్ రూమ్ నుంచి వీక్షించిన రాహుల్ ద్రవిడ్ అగ్రెసివ్ అటిట్యూడ్ తో కనిపించాడు. 'సాధించాం..' అన్న స్థాయిలో ద్రవిడ్ రియాక్షన్ ఇచ్చాడు. అంపైర్ ఔటని ప్రకటించగానే.. పిడికిలి బిగించి విరాట్ కోహ్లీ మాదిరిగా రాహుల్ ద్రవిడ్ సంబురాలు చేసుకున్నాడు. ఈ రియాక్షన్ టీవీ కెమెరాల్లో కనిపించడంతో వైరల్గా మారింది.
మాములుగా ద్రవిడ్ ఇంత అగ్రెసివ్గా చూడటం చాలా అరుదు. గతంలో ఓసారి శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు, ఐపీఎల్ లో ఒకసారి, గతేడాది టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై గెలిచినప్పుడు మాత్రమే ద్రవిడ్ ఈ తరహాలో సంబరాలు చేసుకున్నాడు. శ్రీలంకతో మ్యాచ్ లో ద్రవిడ్ అసహనాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రెడ్ యాప్.. ఏకంగా అతని మీద ఓ యాడ్ కూడా చిత్రీకరించింది. ఈ యాడ్లో ద్రవిడ్.. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి బ్యాట్ తో కారు అద్దాలు పగలగొడతాడు. ఈ వీడియోకు క్రెడ్.. 'ఇందిరానగర్ కా గూండా'అని పేరు పెట్టింది. తాజాగా నాగ్పూర్ టెస్టులో ద్రావిడ్ వీడియో చూశాక నెటిజనులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఇందిరానగర్ గూండా వచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.
రవీంద్ర జడేజా(5/47), రవిచంద్రన్ అశ్విన్(3/42) సత్తా చాటడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది. మార్నస్ లబుషేన్(123 బంతుల్లో 8 ఫోర్లతో 49), స్టీవ్ స్మిత్(107 బంతుల్లో 7 ఫోర్లతో 37), పీటర్ హ్యాండ్స్కోంబ్(84 బంతుల్లో 4 ఫోర్లతో 31), అలెక్స్ క్యారీ(33 బంతుల్లో 7 ఫోర్లతో 36) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించాడు,