
అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తుది దశకు చేరింది. మరికొద్ది సేపట్లో అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు దేశాల ప్రధానులు హాజరవుతుండటంతో ఈ మ్యాచ్కు ప్రత్యేకత సంతరించుకోనుంది. 75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఈ మ్యాచ్ తొలి రోజు స్టేడియానికి రానున్నారు.
టాస్ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నాణెం ఎగరేసే అవకాశాలున్నాయని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా మ్యాచ్ ప్రారంభమైన తర్వాతన ఆయన కాసేపు కామెంట్రీ కూడా చెబుతారని తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేయనున్నారు. స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టిన తర్వాత ఆయన వీక్షించే తొలి టెస్టు మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
తొలి రోజు లక్ష మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తారని అంచనా. ఇప్పటికే 75 వేల టికెట్లు అమ్ముడైన గుజరాత్ క్రికెట్ అసొసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాక నేపథ్యంలో స్టేడియాన్ని ఎస్పీజీ భద్రత వలయం తమ చేతుల్లోకి తీసుకుంది. మరోవైపు తొలి రోజు ఆటకు సంబంధించి టికెట్లు దొరకడం లేదని చాలా మంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధిక శాతం టికెట్లను తన గుప్పిట్లో ఉంచుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాని రాకతో ఈ మ్యాచ్కు రాజకీయ రంగు పులుముకోవడంతో.. గుజరాత్ బీజేపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక లండన్ నుంచి వచ్చిన తాను విమాన, వసతి ఖర్చులు పెట్టుకున్నానని.. చివరకు టికెట్ లభించడం లేదని 'భారత్ ఆర్మీ' వ్యవస్థాపకుడు రాకేశ్ పటేల్ నిరాశ వ్యక్తం చేశాడు. మరోవైపు తమ అభిమానుల కోసం స్టేడియంలో ప్రత్యేకంగా టికెట్ల విక్రయం చేపట్టినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఏది ఏమైనా మెల్ బోర్న్ మైదాన రికార్డు ఈ మ్యాచ్ బ్రేక్ చేయనుంది.