వర్షం కారణంగా సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ చేజారిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ ఫలితం తేలలేదు.
చివరి రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. వర్షం చికాకు పెట్టిందన్నాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయామని చెప్పాడు.

'మేం ఎన్నిసార్లు మైదానంలోకి వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకి పరుగెత్తామో కూడా నాకు గుర్తు లేదు. సాధారణంగా బ్రిస్బేన్లో వర్షం ఇలానే కాసేపు కురిసి ఆగిపోతుంది. ఇలా వర్షం అంతరాయం కలిగించడం చికాకు పెట్టింది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్పై పూర్తి పట్టు సాధించిన తర్వాత విజయం దక్కకపోవడం అసంతృప్తికి గురి చేసింది.
వాతావరణాన్ని అంచనా వేయడం చాలా కష్టం. కానీ మేం ఈ మ్యాచ్పై పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నించాం. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తామనుకున్నా. 10 వికెట్లు చేతుల్లో ఉన్న టీమిండియా లక్ష్యచేధనకు ప్రయత్నిస్తుందనుకున్నా. 10 వికెట్లు తీసేందుకు కావాల్సిన ఓవర్లు కూడా ఉన్నాయి. కానీ వాతావరణం సహకరించలేదు. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయం కోసం ప్రయత్నించడం గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరు మంచి ఉద్దేశంతో ఆడారు. రెండో ఇన్నింగ్స్లో వికెట్లను కాపాడుకోవడం కంటే దూకుడుగా ఆడటమే ఉత్తమని భావించాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం షాక్కు గురి చేసిందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. 'సిరీస్ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో షాకయ్యాను. అతను టీమిండియా ఛాంపియన్ ప్లేయర్. గత 10 ఏళ్లకుపైగా టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతనికి అద్భుతమైన కెరీర్ ఉంది.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం టీమిండియా 260 పరుగులకు ఆలౌటైంది. 185 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ లక్ష్యచేధనకు టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 8/0తో నిలిచింది. వర్షం తీవ్రత పెరగడంతో అంపైర్లు మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు.