మొహాలీ: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరగనున్న తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) తెలిపాడు. ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో ఈ ఇద్దరూ తొలి వన్డే ఆడటం లేదని కమిన్స్ స్పష్టం చేశాడు.
వన్డే ప్రపంచకప్ ముందు ఈ మూడు వన్డేల సిరీస్ (India vs Australia) ఇరు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్తో జరిగిన యాషెస్ సిరీస్ సందర్భంగా మిచెల్ స్టార్క్కు భుజ గాయమైంది.

23 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న అతను భుజగాయంతో జట్టుకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనకు కూడా దూరంగా ఉన్నాడు. ప్రపంచకప్ నేపథ్యంలో భారత్తో సిరీస్కు అతన్ని ఎంపిక చేయగా.. తొలి మ్యాచ్ ఆడటం లేదని ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశాడు.
తొలి వన్డే నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కమిన్స్.. ముందస్తు చర్యల్లో భాగంగానే స్టార్క్(Mitchell Starc), మ్యాక్స్వెల్ను ఆడించడం లేదని స్పష్టం చేశాడు.
'మిచెల్ స్టార్క్ పూర్తి ఫిట్గా ఉన్నాడు. భారత్కు కూడా వచ్చాడు. రేపు భారత్తో తొలి వన్డే ఆడాలని అతను భావిస్తున్నారు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా మేం అతనికి విశ్రాంతినిస్తున్నాం. తర్వాతి మ్యాచ్ల్లో ఆడించాలనుకుంటున్నాం. మ్యాక్స్వెల్(Glenn Maxwell)ది కూడా ఇదే పరిస్థితి.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఇక స్టార్క్ నెట్స్లో కూడా బౌలింగ్ చేస్తున్నాడని తెలిపాడు. ప్రపంచకప్ నేపథ్యంలో ప్రణాళిక ప్రకారమే అతన్ని ఉపయోగిస్తామని చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్ వేదికగా జరిగిన వన్డే సిరీస్లో స్టార్క్ హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. గత రెండు ప్రపంచకప్ల్లోనూ అతనే అత్యధిక వికెట్లు తీసాడు.