ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా పోరాడుతోంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(176 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 105 బ్యాటింగ్) అసాధారణ శతకంతో ఫాలో ఆన్ తప్పించుకున్న భారత్.. ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించే దిశగా సాగుతోంది. నితీష్ సంచలన శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.
క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మహమ్మద్ సిరాజ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. నితీష్తో పాటు వాషింగ్టన్ సుందర్(162 బంతుల్లో ఫోర్తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.

రిషభ్ పంత్ విఫలం..
164/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన రిషభ్ పంత్(28) స్కాట్ బోలాండ్ బౌలింగ్లో అనవసర షాట్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. 8వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్కు రాగా.. రవీంద్ర జడేజా ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు.
జడేజా నెమ్మదిగా ఆడిన నితీష్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. క్రీజులో సెట్ అవుతున్న ఈ జోడీని నాథన్ లయన్ విడదీసాడు. జడేజాను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. జడేజా ఔటైనా.. క్రీజులోకి వచ్చిన సుందర్తో కలిసి నితీష్ రెడ్డి సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. దాంతో భారత్ 244/7 ఓవర్నైట్ స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
నితీష్.. నీ అవ్వ తగ్గేదేలే..
రెండో సెషన్ ఆరంభంలోనే నితీష్ కుమార్ రెడ్డి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ అర్థశతకాన్ని పుష్ప ట్రేడ్ మార్క్ తగ్గేదేలే స్టైల్లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆట తిరిగి ప్రారంభం కాగా.. నితీష్ అదే దూకుడు కనబర్చాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో నితీష్కు అండగా నిలిచాడు. దాంతో భారత్ 326/7తో టీబ్రేక్కు వెళ్లింది.
మూడో సెషన్లో ఈ జోడీ సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ 146 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు నితీష్ సెంచరీకి చేరువయ్యాడు. నితీష్ 96 పరుగుల వద్ద ఉండగా.. నాథన్ లయన్ వేసిన అనూహ్య బౌన్స్కు సుందర్ స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో 8వ వికెట్కు నమోదైన 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

సెంచరీపై ఉత్కంఠ..
క్రీజులోకి బుమ్రా రాగా.. నితీష్ సింగిల్స్ తీస్తూ 99 పరుగులకు చేరుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో బుమ్రా(0) ఔటయ్యాడు. దాంతో నితీష్ శతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రీజులోకి వచ్చిన సిరాజ్ మూడు బంతులను అద్భుతంగా ఆడి నితీష్కు స్ట్రైక్ ఇచ్చాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో రెండు బంతులను డిఫెన్స్ చేసిన నితీష్ మూడో బంతిని బౌండరీకి తరలించి 171 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. నితీష్ శతకాన్ని చూసి అతని తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.