
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత బౌలర్ల జోరు కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్లోనూ భారత బౌలర్లు అదరగొట్టడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖవాజా(125 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 81), పీటర్ హాండ్స్కోంబ్(142 బంతుల్లో 9 ఫోర్లతో 72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(4/60) నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్(3/57), రవీంద్ర జడేజా(3/68) మూడేసి వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ షమీ స్టన్నింగ్ డెలివరీకి డేవిడ్ వార్నర్(15) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే మార్నస్ లబుషేన్(18)ను అశ్విన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(0) ఆ మరుసటి బంతికే అశ్విన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఉస్మాన్ ఖవాజా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్ 94/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
విరామం అనంతరం ట్రావిస్ హెడ్ను షమీ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన పీటర్ హ్యాండ్స్కోంబ్తో ఉస్మాన్ ఖవాజా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 52 పరుగల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో రవీంద్ర జడేజా విడదీసాడు. ఈ వికెట్తో టెస్ట్ కెరీర్లో 250 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీని అశ్విన్ డకౌట్గా పెవిలియన్ చేర్చగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హ్యాండ్స్కోంబ్కు అండగా నిలిచాడు. ఏడో వికెట్కు 60 పరుగులు జోడించిన అనంతరం ప్యాట్ కమిన్స్ జడేజా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన టాడ్ మర్ఫీని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాథన్ లియోన్(10), మాథ్యూ కుహ్నేమన్(6) కాసేపు పోరాడినా షమీ వారిని పెవిలియన్కు పంపించి ఆసీస్ ఇన్నింగ్స్కు తెరదించాడు.