
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ను కలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతని చర్యతో అప్రమత్తమైన సెక్యూరిటీ సదరు అభిమానిని ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లారు.
దీనికి అతను ఏ మాత్రం సహకరించకపోవడంతో పిడి గుద్దులు గుద్దారు. ఇది గమనించిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ.. అతన్ని కొట్టకుండా బయటకు తీసుకెళ్లాలని సెక్యూరిటీకి సూచించాడు. షమీ సూచనలతో కొట్టడం ఆపేసిని సెక్యూరిటీ మాములుగా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. షమీపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖవాజా(125 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 81), పీటర్ హాండ్స్కోంబ్(142 బంతుల్లో 9 ఫోర్లతో 72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(4/60) నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్(3/57), రవీంద్ర జడేజా(3/68) మూడేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(13 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(4 బ్యాటింగ్) ఉన్నారు.