మొహాలీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(5/51) ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్ల తోడుగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మిచెల్ మార్ష్(4) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్తో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు సమయం తీసుకోవడంతో ఆసీస్.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 42 పరుగులే చేసింది. పవర్ ప్లే అనంతరం ధాటిగా ఆడిన వార్నర్ 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
94 పరుగులతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా విడదీసాడు. డేవిడ్ వార్నర్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన స్మిత్ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో మార్నస్ లబుషే, కామెరూన్ గ్రీన్(31) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే అశ్విన్ తెలివైన బంతితో లబుషేన్ను స్టంపౌట్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫీల్డింగ్కు కామెరూన్ గ్రీన్ రనౌట్గా వెనుదిరిగాడు.
అనంతరం జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టోయినీస్ కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ జోడీని షమీ విడదీసాడు. మార్కస్ స్టోయినీస్(29)ను క్లీన్ బౌల్డ్ చేయగా.. జోష్ ఇంగ్లీస్(45)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆసీస్ 276 పరుగులు చేయగలిగింది.