
విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మిచెల్ స్టార్క్(5/53), సీన్ అబాట్(3/23), నాథన్ ఎల్లిస్(2/13) దెబ్బకు టీమిండియా 26 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 4 ఫోర్లతో 31), అక్షర్ పటేల్(29 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్ గిల్ సిల్వర్ డక్గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్( Mitchell Starc) వేసిన ఫస్ట్ ఓవర్ మూడో బంతికి గిల్ క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీతో రోహిత్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు. వరుస బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ మిచెల్ స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్(13), సూర్య(0)ను ఔట్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీసాడు.
సూర్య వరుసగా రెండో మ్యాచ్లోనూ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్(9)ను కూడా స్టార్క్ ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో టీమిండియా 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలుస్తాడనుకున్న హార్దిక్.. స్మిత్ సెన్సేషనల్ క్యాచ్కు వెనుదిరిగాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా రాగా.. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీని నాథన్ ఎల్లిస్ ఇన్స్వింగర్తో వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. జడేజా-అక్షర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. ఎల్లిస్ అవకాశం ఇవ్వలేదు. జడేజాను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్(4) సీన్ అబాట్ ఔట్ చేయగా.. మహమ్మద్ సిరాజ్(0), మహమ్మద్ షమీ(0)లను వరుస ఓవర్లలో స్టార్క్ పెవిలియన్ చేర్చి భారత ఇన్నింగ్స్కు తెరదించాడు.