IND vs AUS: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియా విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ తొలి నాలుగు బంతుల్లో ఒకే పరుగు ఇచ్చి కీలక మాథ్యూ వేడ్ను ఔట్ చేశాడు. దాంతో ఆసీస్ విజయ సమీకరణం 2 బంతుల్లో 9 పరుగులుగా మారింది. ఈ దశలో ఐదో బంతిని ఎదుర్కొన్న నాథన్ ఎల్లిస్ స్ట్రైట్గా ఆడాడు.

ఈ బంతిని బౌలింగ్ వేసి ఫాలోత్రూలో అర్ష్దీప్ సింగ్ ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ బంతి వికెట్ల వెనుకా ఉన్న ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మకు బలంగా తగిలింది. కొంచెం అయితే అంపైర్కు తాకరాని చోటు తాకేది. అతను అప్రమత్తమై బంతిని తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తొడకు తాకింది. లేకుంటే అంపైర్ బాక్స్ బద్దలయ్యేది.
కామెంటేటర్లు సైతం ఓహో.. జస్ట్ మిస్ అంటూ గట్టిగా అరిచారు. అయితే ఈ బంతి అంపైర్కు తాకడం టీమిండియాకు కలిసొచ్చింది. అంపైర్కు తాకపోయి ఉంటే నేరుగా బౌండరీకి వెళ్లేది. అప్పుడు చివరి బంతికి 5 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చేది. బౌండరీ బాదితే మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసేది. సిక్స్ కొడితే ఆసీస్కు విజయం దక్కేది.
ఈ క్రమంలోనే అంపైర్ పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆగ్రహంగా రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) అతనికి అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. బెన్ మెక్డెర్మోట్(36 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 22) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.