IND vs AUS: అంపైర్ల తప్పిదం కారణంగానే టీమిండియాతో జరిగిన చివరి టీ20లో ఆస్ట్రేలియా ఓటమిపాలైందని ఆ జట్టు మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించింది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ సూపర్ బౌలింగ్తో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 10 పరుగుల అవసరమవ్వగా.. అర్ష్దీప్ సింగ్ ఓ వికెట్ తీయడంతో పాటు 3 పరుగులే ఇచ్చి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

అయితే ఈ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని అర్ష్దీప్ సింగ్ బౌన్సర్గా వేయగా.. మాథ్యూ వేడ్ ఫుల్ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. అయితే బంతి.. బ్యాటర్ కంటే ఎత్తులో వెళ్లడంతో వైడ్గా ప్రకటిస్తారని మాథ్యూ వేడ్ భావించాడు.
కానీ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో షాకయ్యాడు. అంపైర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన మాథ్యూ హెడెన్ సైతం అంపైర్లను తప్పుబట్టాడు. అది కచ్చితంగా వైడేనని తెలిపాడు. అంపైర్ల నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకొచ్చాడు.
ఈ ఓవర్ ఐదో బంతిని ఎదుర్కొన్న నాథన్ ఎల్లిస్ స్ట్రైట్గా ఆడాడు. ఈ బంతిని అర్ష్దీప్ సింగ్ ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ బంతి వికెట్ల వెనుకా ఉన్న ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మకు బలంగా తగిలింది. అయితే ఈ బంతి అంపైర్కు తాకడం టీమిండియాకు కలిసొచ్చింది.
అంపైర్కు తాకపోయి ఉంటే నేరుగా బౌండరీకి వెళ్లేది. అప్పుడు చివరి బంతికి 5 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చేది. బౌండరీ బాదితే మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసేది. సిక్స్ కొడితే ఆసీస్కు విజయం దక్కేది.
ఈ బంతిపైనా మాథ్యూ హెడెన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్ తన పాత్రను ఈ ఓవర్లో రెండోసారి విజయవంతంగా పోషించాడంటూ విమర్శలు గుప్పించాడు. అంపైర్ ఉద్దేశపూర్వకంగా చేయకున్నా.. జట్టు ఓటమిపాలయ్యిందనే బాధలో ఈ వ్యాఖ్యలు చేశాడు. మాథ్యూ వేడ్ సైతం కోపంగా తన రియాక్షన్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) అతనికి అండగా నిలిచాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.