
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. నాగ్పూర్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్లో సత్తా చాటి పర్యాటక ఆస్ట్రేలియాను 177 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగి బలమైన పునాది వేసింది. బౌలింగ్లో రవీంద్ర జడేజా(5/47), రవిచంద్రన్ అశ్విన్(3/42) సత్తా చాటగా.. పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ చెరొక వికెట్తో శుభారంభాన్ని అందించారు.
బ్యాటింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. దాంతో తొలి రోజు భారత్దే పై చేయి అయ్యింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసినా.. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టినా తొలి రోజు ఆటను మలుపు తిప్పింది మాత్రం తెలుగు తేజం కేఎస్ భరతే. ఈ మ్యాచ్తోనే అంతర్జాతీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈ కోనసీమ కుర్రాడు.. మహేంద్ర సింగ్ ధోనీ తరహా కీపింగ్తో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.
క్రీజులో పాతుకుపోయి హాఫ్ సెంచరీకి చేరువైన డేంజరస్ మార్నస్ లబుషేన్(49)ను రెప్పపాటు సమయంలోనే స్టంపౌట్ చేసి ఆటను మలుపు తిప్పాడు. రవీంద్ర జడేజా వేసిన 36 ఓవర్ ఐదో బంతికి కేఎస్ భరత్ స్టన్నింగ్ కీపింగ్కు లబుషేన్ వెనుదిరిగాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్పై వేసిన బంతిని లబుషేన్ డ్రైవ్ షాట్ ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను క్రీజు ధాటగా భరత్.. ఏ మాత్రం తప్పు చేయకుండా స్టంప్ ఔట్ చేశాడు. ఆ మరుసటి బంతికే మ్యాట్ రేన్షా(0) కూడా ఔటవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
వాస్తవానికి 2 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఆసీస్ను లబుషేన్, స్మిత్ ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ రెండో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దాంతో ఆసీస్ ఇన్నింగ్స్ ట్రాక్ ఎక్కిందని అంతా అనుకున్నారు. కానీ భరత్ సూపర్ స్టంప్తో మలుపు తిప్పాడు. లబుషేన్ ఔటైన కాసేపటికే స్మిత్ కూడా వెనుదిరగడంతో ఆసీస్ పతనం మొదలైంది. మధ్యలో పీటర్ హ్యాండ్స్కోంబ్, అలెక్స్ క్యారీ 53 పరుగుల భాగస్వామ్యం అందించినా ఫలితం లేకపోయింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 56 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(71 బంతుల్లో ఫోర్తో 20)మరోసారి విఫలమయ్యాడు. తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. నైట్ వాచ్మన్గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(0) మరో వికెట్ పడకుండా ఆడాడు.