
అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ధాటిగా ఆడుతున్న ఆసీస్ ఓపెనింగ్ జోడీని ఎట్టకేలకు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విడదీసాడు. క్రీజులో సెట్ అయిన డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(44 బంతుల్లో 7 ఫోర్లతో 32)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
అశ్విన్ వేసిన ఫ్లైటెడ్ డెలివరీని ట్రావిస్ హెడ్ లాఫ్టెడ్ షాట్ ఆడాడు. అయితే సరైన ఎలివేషన్ దొరకకపోవడంతో మిడాన్లో ఉన్న రవీంద్ర జడేజా చేతుల్లోకి వెళ్లింది. దాంతో తొలి వికెట్కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి లబుషేషన్ రాగా.. ఖవాజా ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. పేసర్లతో లాభం లేదని గ్రహించిన రోహిత్.. స్పిన్నర్లతో బౌలింగ్ చేయిస్తున్నాడు.
ఇక ట్రావిస్ హెడ్ ఔటవ్వడంతో టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ట్రావిస్ హెడ్ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్ను భరత్ నేలపాలు చేశాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 6వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉమేశ్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ట్రావిస్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలోకి దూసుకెళ్లింది. కానీ బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయిన భరత్.. నేలపాలు చేశాడు.
గ్లోవ్స్ ముందుగా మూసేయడంతో నేలపాలైంది. అప్పుడు ట్రావిస్ హెడ్ ఏడు పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే.. ఆసీస్ ఒత్తిడికి లోనయ్యేది. ఈ అవకాశంతో బ్యాటింగ్ కొనసాగించిన ట్రావిస్ హెడ్ జట్టుకు కావాల్సిన శుభారంభం అందించాడు. ఎట్టకేలకు అశ్విన్ ఔట్ చేయడంతో భరత్ ఊపీరి పీల్చుకున్నాడు.
75 ఏళ్ల భారత్-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఈ మ్యాచ్ తొలి రోజు స్టేడియానికి వచ్చారు. టాస్కు ముందు ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. నరేంద్ర మోదీ టాస్ కాయిన్ ఎగరవేస్తాడని ప్రచారం జరిగినా.. ప్రధానులు ఆటలో భాగమవ్వలేదు. మైదానంలో తిరిగిన అనంతరం స్టేడియం లోపలి నిర్మణాలను చూశారు. టీమిండియా సాధించిన విజయాలతో పాటు మైదానం లోపల ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలను తిలకరించారు. మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి.. ఇరు దేశాల ప్రధానులకు వివరించాడు.