టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ పట్ల సిరాజ్ ప్రవర్తించిన తీరును కృష్ణమాచారి తప్పుబట్టాడు. ఇదో పనికిమాలిన చర్య అని మండిపడ్డాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్లో శతకం బాదిన ట్రావిస్ హెడ్ను ఔట్ చేసి సిరాజ్ ఆగ్రహంగా సంబరాలు చేసుకుంటూ సెండాఫ్ ఇచ్చాడు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమవ్వగా.. మాజీ క్రికెటర్లు సిరాజ్ను తప్పబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇప్పటికే సునీల్ గవాస్కర్.. సిరాజ్ చర్యను తప్పుబట్టాడు. తాజాగా క్రిష్ శ్రీకాంత్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించాడు. అసలు సిరాజ్కు బుర్ర పనిచేస్తుందా? అని ప్రశ్నించాడు. 'ట్రావిస్ హెడ్ నిర్దాక్షిణ్యంగా ఆడాడు. సిరాజ్.. నీకు బుద్దుందా? నువ్వేం చేస్తున్నావో? అర్థం అవుతుందా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ట్రావిస్ హెడ్ నీ బౌలింగ్లో సిక్సర్ల మోత మోగించాడు. చాలా ఈజీగా 140 పరుగులు చేశాడు.
అలాంటి బ్యాటర్ ఔటైనప్పుడు అభినందించాల్సింది పోయి.. గొడవపడుతావా? ఇది స్లెడ్జింగ్ కాదు.. పనికిమాలిన చర్య. 140 పరుగులు చేసిన ఆటగాడికి క్రెడిట్ ఇవ్వాలి. అతని ఇన్నింగ్స్ను మెచ్చుకోవాలి. అతన్ని 10 రన్స్ లేదా డకౌట్ చేసి ఉంటే సంబరాలు చేసుకున్నా ఓ అర్థం. కానీ, ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.'అని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ వివాదాస్పద ఘటనపై సిరాజ్, ట్రావిస్ హెడ్ స్పందిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకుంటే సిరాజ్.. ఆగ్రహానికి గురయ్యాడని, అతని తీరు తనకు నచ్చలేదని ట్రావిస్ హెడ్ మీడియా సమావేశంలో తెలిపాడు.
మరోవైపు సిరాజ్.. ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడని, తన బౌలింగ్ను మెచ్చుకోలేదన్నాడు. వికెట్ తీసిన సంతోషంలో సంబరాలు చేసుకుంటే.. అసభ్య పదజాలతో తిట్టాడని, దాంతోనే తాను అలా రియాక్ట్ అయ్యానని స్పష్టం చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. దాంతో ఈ గొడవ సద్దుమణిగింది. కానీ ఈ వార్ సిరీస్ మొత్తం కొనసాగే అవకాశం ఉంది. పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్ట్ శనివారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానుంది.