
న్యూఢిల్లీ: స్ట్రైక్రేట్ గురించి అతిగా మాట్లాడుతున్నారని టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఫార్మాట్ ఏదైనా స్ట్రైక్రేట్ ముఖ్యమేనని తెలిపిన రాహుల్.. దానిని అతిగా అంచనా వేయడం కూడా సరికాదన్నాడు. స్ట్రైక్రేట్ కన్నా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడమే ముఖ్యమని చెప్పాడు. ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ఫార్మాట్ ఏదైనా సరే స్ట్రైక్రేట్ ముఖ్యమే. కానీ, దానిని అతిగా అంచనా వేసి చెప్పడం కూడా సరైంది కాదు. ఇదే మాట నేను గతంలోనూ చెప్పా. పరిస్థితిని బట్టి ఇది మారిపోతూ ఉంటుంది. ఓ మ్యాచ్లో 140 పరుగులనే ఛేదించాల్సి వచ్చినప్పుడు 200 స్ట్రైక్రేట్తో ఆడాల్సిన అవసరం లేదు. అందుకే, మ్యాచ్నుబట్టి, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్పా ప్రతీ మ్యాచ్ దూకుడుగా ఆడాలంటే కుదరదు'అని తెలిపాడు. లక్నో జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు మెంటార్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెక్రటరీ జై షా హాజరయ్యారు.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న కేఎల్ రాహుల్ తొలి రెండు టెస్ట్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో మూడో టెస్ట్కు అతని స్థానంలో శుభ్మన్ గిల్ జట్టులోకి వచ్చాడు. అతను కూడా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల తర్వాత భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు మ్యాచ్ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతోనే వన్డే సిరీస్లో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ రాహుల్కు అవకాశం దక్కే సూచనలు కనబడటం లేదు.
ఈ సిరీస్ అనంతరం టీమిండియా ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అనంతరం మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్లో పేలవ ఫామ్ కనబరిచే రాహుల్.. ఐపీఎల్లో మాత్రం నిలకడగా రాణిస్తాడు. అయితే అతను భారీ ఇన్నింగ్స్లు ఆడిన స్ట్రైక్రేట్ తక్కువగా ఉంటుందనే విమర్శ ఉంది. ఈ క్రమంలోనే స్ట్రైక్ రేట్పై రాహుల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.