
ముంబై: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. ముంబై వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేఎల్ రాహుల్(91 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 75 నాటౌట్), రవీంద్ర జడేజా(69 బంతుల్లో 5 ఫోర్లతో 45 నాటౌట్) సూపర్ బ్యాటింగ్తో ఓడిపోయే మ్యాచ్లో గెలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసి గెలుపొందింది. అయితే లక్ష్యచేధనలో టీమిండియా 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 6వ వికెట్కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి ఓటమిని తప్పించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. మార్కస్ స్టోయినీస్ వేసిన రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్(3) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(4) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ దెబ్బకు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరూ ఎల్బీగా వెనుదిరగడం విశేషం. సూర్యకుమార్ ఔట్ విషయంలో అంపైర్ ఔటివ్వకున్నా.. ఆసీస్ రివ్యూతో ఫలితాన్ని రాబట్టింది. దాంతో భారత్ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్తో కలిసి శుభ్మన్ గిల్(20) ఇన్నింగ్స్ ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో భారత్ పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 39 పరుగులే చేసింది.
క్రీజులో సెట్ అయ్యాడనుకున్న శుభ్మన్ గిల్ను మిచెల్ స్టార్క్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. మార్నస్ లబుషేన్ సూపర్ క్యాచ్కు గిల్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పూర్తిగా డిఫెన్స్కు పరిమితమైన ఈ జోడీ.. సింగిల్స్, డబుల్స్తో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డ బంతులను బౌండరీకి తరలించింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని మార్కస్ స్టోయినీస్ విడదీసాడు.
సూపర్ బౌన్సర్తో క్యాచ్ ఔట్గా హార్దిక్ పాండ్యాను బోల్తా కొట్టించాడు. దాంతో 44 పరుగుల స్వల్ప భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడేజాతో కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడాడు. ఓపికగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపించాడు. ఈ క్రమంలో రాహుల్ 73 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడిన రాహుల్ ఓ సిక్సర్, రెండు ఫోర్లతో మ్యాచ్ను భారత్వైపు తిప్పాడు. జడేజా సైతం అతనికి అండగా నిలవడంతో భారత విజయ లాంఛనం పూర్తయింది.