ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా ఓటమిని తప్పించుకుంది. టెయిలెండర్స్ జస్ప్రీత్ బుమ్రా(27 బంతుల్లో సిక్స్తో 10 బ్యాటింగ్), ఆకాశ్ దీప్(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27 బ్యాటింగ్) అసాధారణ బ్యాటింగ్తో టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు.
ఆఖరి వికెట్కు అజేయంగా 39 పరుగులు జోడించారు. వెలుతురు లేమితో అంపైర్లు నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 9 వికెట్లకు 252 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది. బుధవారం చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. 51/4 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే అదృష్టం కలిసొచ్చింది.
తొలి బంతికే కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో స్మిత్ నేలపాలు చేశాడు. 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లభించిన ఈ అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకున్నాడు. ఆ కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(10)ను కమిన్స్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన జడేజా సాయంతో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో రాహుల్ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో భారత్ 167/6 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
లంచ్ బ్రేక్ అనంతరం కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. ఆట తిరిగి ప్రారంభమవ్వగా.. స్మిత్ స్టన్నింగ్ క్యాచ్కు కేఎల్ రాహుల్ వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో జడేజా పోరాడాడు. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. భారత జట్టుకు ఫాలో ఆన్ గండం గట్టెక్కించే ప్రయత్నం చేశాడు.
నితీష్ కుమార్ రెడ్డి ఔటైనా.. సిరాజ్తో కలిసి జట్టు స్కోర్ను 200 పరుగుల మార్క్ను ధాటించాడు. 201/7 స్కోర్ టీమిండియా టీ బ్రేక్కు వెళ్లగా.. మూడో సెషన్ ప్రారంభంలోనే సిరాజ్ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. ఆ కాసేపటికే జడేజా కూడా కమిన్స్ బౌలింగ్లో వెనుదిరిగడంతో భారత్ ఫాలో ఆన్ ఆడటం తప్పదని అంతా అనుకున్నారు. కానీ బుమ్రా-ఆకాశ్ దీప్ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియాను ఆదుకున్నారు. కీలక భాగస్వామ్యంతో ఫాలో ఆన్ గండాన్ని గట్టెక్కించడంతో పాటు ఓటమిని తప్పించారు.