ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(153 బంతుల్లో 4 ఫోర్లతో 62 బ్యాటింగ్) అసాధారణ బ్యాటింగ్తో చెలరేగారు.
దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత ఓపెనర్లు ఆసీస్ గడ్డపై 100 ప్లస్ రన్స్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బ్యాటర్ల సాధికారిక బ్యాటింగ్తో ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. పిచ్ కూడా మారడంతో ఆసీస్ బౌలర్లకు కష్టమైంది. ఓపికగా ఆడిన భారత ఓపెనర్లు ఎలాంటి తప్పిదం చేయకుండా పరుగులు రాబట్టారు.

ఆసీస్ బౌలర్లకు చుక్కలు..
సమన్వయంతో బ్యాటింగ్ చేసి ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శతవిధాల ప్రయత్నించాడు. జట్టులో ఉన్న బౌలింగ్ ఆప్షన్స్ అన్నింటిని ఉపయోగించినా ఫలితం దక్కలేదు. చివరకు మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్తో కూడా బౌలింగ్ చేయించాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది. మూడో రోజు ఆటలో టీమిండియా రెండు సెషన్లు ఆడినా.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం నమోదవుతోంది.
ఆసీస్ 104 ఆలౌట్..
అంతకుముందు 67/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాటర్లు మిచెల్ స్టార్క్(112 బంతుల్లో 2 ఫోర్లతో 26), అలెక్స్ క్యారీ(31 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రెండో రోజు వేసిన ఫస్ట్ ఓవర్లోనే బుమ్రా.. అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఆ కాసేపటికే నాథన్ లయన్ను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్ చేశాడు. మరోవైపు జిడ్డు బ్యాటింగ్తో మిచెల్ స్టార్క్ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. అతన్ని హర్షిత్ రాణా అద్భుత బంతితో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి ఆసీస్ ఇన్నింగ్స్కు తెరదించాడు.
భారత్ 150
భారత బౌలర్లలో బుమ్రా(5/30) ఐదు వికెట్లు తీయగా.. అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా(3/48) మూడు వికెట్లు.. మహమ్మద్ సిరాజ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. నితీష్ కుమార్ రెడ్డి(59 బంతుల్లో 6 ఫోర్లతు, సిక్స్తో 41), రిషభ్ పంత్(78 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 37), కేఎల్ రాహుల్(74 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.