ఆస్ట్రేలియా గడ్డపై భారత్-ఏ కష్టాలు కొనసాగుతున్నాయి. రెండో అనధికారిక టెస్ట్లోనూ భారత్-ఏ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పేలవ బ్యాటింగ్తో తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే ఆలౌటయ్యారు. కీలక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ప్రాక్టీస్ కోసం కేఎల్ రాహుల్ను భారత్-ఏ జట్టులో చేర్చగా అతను దారుణంగా విఫలమయ్యాడు. 4 బంతుల్లో 4 పరుగులే చేసి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
పేస్ ఆల్రౌండర్గా భారీ అంచనాలతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన తెలుగు తేజం, నితీష్ కుమార్ రెడ్డి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 35 బంతుల్లో 16 పరుగులే చేసి కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. భారత్-ఏ తరఫున నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటితే ప్రధాన జట్టులోకి తీసుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం తొలి అనధికారిక టెస్ట్తో పాటు తాజా మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.

యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 80)హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కాగా.. మరో నలుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
ఆస్ట్రేలియా-ఏ బౌలర్లలో మైకేల్ నెసెర్ నాలుగు వికెట్లు తీయగా.. బీ వెబ్స్టర్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్, కోరీ, నాథన్ మెక్స్వామీ తలో వికెట్ తీసారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
కేఎల్ రాహుల్ వైఫల్యం టీమిండియా అభిమానులతో పాటు మేనేజ్మెంట్ ఆందోళనకు గురి చేస్తోంది. పేలవ బ్యాటింగ్తోనే తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్కు ఆసీస్ పర్యటనలో ఓపెనర్గా అవకాశమివ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. తొలి టెస్ట్కు రోహిత్ శర్మ దూరంగా ఉండనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే రాహుల్ అందరి కన్నా ముందే ఆస్ట్రేలియా పంపించి.. భారత్-ఏ తరఫున ఓపెనర్గా బరిలోకి దించింది. కానీ అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో కూడా రాహుల్ విఫలమైతే.. భారత జట్టులో అతనికి చోటు దక్కడం కష్టమే. ఇప్పటికే సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్కు గురైన టీమిండియా.. ఆసీస్ గడ్డపై ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవద్దు.