
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస పరాజయాలతో చతికిలపడిన ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా పయనమవ్వగా.. గాయాలతో మరో ఇద్దరూ ప్లేయర్లు దూరమైనట్లు తెలుస్తోంది. రెండో టెస్ట్లో కంకషన్ ఇంజ్యూరీకి గురైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్తో పాటు స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఫాక్స్ స్పోర్ట్స్ తెలిపింది. ఢిల్లీ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్లు వార్నర్ తలతో పాటు శరీరానికి బలంగా తాకాయి.
దాంతో అతను డగౌట్కు పరిమితమయ్యాడు. కంకషన్ సబ్స్టిట్యూట్గా మ్యాట్ రేన్షా బరిలోకి దిగాడు. అయితే వార్నర్ మోచేతికి బలమైన గాయమైందని, స్కానింగ్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ ఉన్నట్లు ఫాక్స్ స్పోర్ట్స్ తెలిపింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని, దాంతో వార్నర్ స్వదేశం వెళ్లనున్నాడని పేర్కొంది. ఇక గాయంతోనే భారత్కు వచ్చిన జోష్ హజెల్ వుడ్ పూర్తి కోలుకోలేదని, అతను కూడా సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడని సమాచారం.

ఇక వ్యక్తిగత కారణాలతోనే కమిన్స్ ఉన్న పళంగా భారత్ను వీడేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఢిల్లీ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగియడంతో మూడో టెస్ట్కు 9 రోజుల బ్రేక్ లభించింది. దాంతో కమిన్స్ స్వదేశం వెళ్లి తిరిగిరావాలనుకున్నాడని ఆసీస్ టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. మూడో టెస్ట్ మార్చి1న ఇండోర్ వేదికగా ప్రారంభం కానుంది. ఆలోపు కమిన్స్ తిరిగివస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వర్గాలు తెలిపాయి . అయితే కమిన్స్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే అతను ఉన్న పళంగా ఆసీస్ పయనమైనట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల కమిన్స్ మూడో టెస్ట్ ఆడలేకపోతే వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు.

గాయాలతో తొలి రెండు టెస్ట్లకు దూరమైన కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ పూర్తిగా కోలుకున్నారని, మూడో టెస్ట్ ఆడుతారని ఫాక్స్ స్పోర్ట్స్ పేర్కొంది. ఈ క్రమంలోనే వార్నర్, జోష్ హజెల్ వుడ్ను జట్టు నుంచి రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ జట్టులోకి వస్తే కమిన్స్ అవసరం ఆసీస్కు ఉండదు. ఆసీస్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.