
ముంబై: 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ పేసర్, రంజీ ఛాంపియన్ జయదేవ్ ఉనాద్కత్.. వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆదివారమే ముగిసిన దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2022-23లో సౌరాష్ట్రను విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్కు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించింది. దాంతో అతను 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. చివరగా ఉనాద్కత్ 2013లో వన్డే మ్యాచ్ ఆడాడు.
బెంగాల్తో జరిగిన రంజీ ఫైనల్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా రెండో టైటిల్ను అందుకుంది. గత సీజన్ రంజీ ట్రోపీ 2021-22ని కూడా సౌరాష్ట్రనే గెలవడం విశేషం. ఫైనల్లో సత్తా చాటిన కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ (6/85), (3/44)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ ప్రదర్శనతో సెలెక్టర్లు అతన్ని వన్డేలకు ఎంపిక చేశారు.
గాయంతో కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్కు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. వ్యక్తిగత పనులతో తొలి వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానుండగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడిన ఆటగాళ్లంతా జట్టులో చోటు దక్కించుకోగా.. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇచ్చాడు. దాంతో రజత్ పటీదార్కు అవకాశం దక్కలేదు. అక్షర్ పటేల్ కూడా రీఎంట్రీ ఇవ్వడంతో షెహ్బాజ్ అహ్మద్ ఉద్వాసనకు గురయ్యాడు. రవీంద్ర జడేజా సైతం ఈ సిరీస్తోనే పరిమిత ఓవర్ల క్రికెట్లోకి పునరాగమనం చేయనున్నాడు. మార్చి 17, 19, 22 తేదీల్లో ఈ సిరీస్ జరుగనుంది. వరుసగా ముంబై, వైజాగ్, చెన్నై ఈ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తాయి.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్.