ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ ముందు ఊరించే లక్ష్యం నమోదైంది. 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నమోదైంది. చివరి రోజు ఆటలో ఇంకా 56 ఓవర్ల ఆట మిగిలింది. వర్షం అంతరాయం కలిగించకుండా ఉండకుండా 56 ఓవర్ల ఆట సాగితే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది.
టీమిండియా గంబాల్ అప్రోచ్తో దూకుడుగా ఆడితే ఈ లక్ష్యాన్ని అధిగమించవచ్చు. మరోవైపు సంచలన బౌలింగ్తో భారత్ను ఆలౌట్ చేసే అవకాశం కూడా ఉంది. డిఫెన్స్ మోడ్లో ఆడినా.. వర్షం అంతరాయం కలిగించినా ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసే అవకాశం ఉంది.

అంతకుముందు 252/9 ఓవర్నైట్ స్కోర్తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 8 పరుగులను జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ బౌలింగ్లో ఆకాశ్ దీప్(44 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31)ఆఖరి వికెట్గా పెవిలియన్ చేరాడు. జస్ప్రీత్ బుమ్రా(10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు భారత బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. జస్ప్రీత్ బుమ్రా(3/18), ఆకాశ్ దీప్(2/28), మహమ్మద్ సిరాజ్(2/38) నిప్పులు చెరగడంతో ఆసీస్ 85 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే ఆ జట్టు డిక్లేర్ చేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో నాథన్ మెక్స్వీనీ(4), ఉస్మాన్ ఖవాజా(8), మార్నస్ లబుషేన్(1), మిచెల్ మార్ష్(2), స్టీవ్ స్మిత్(4) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ట్రావిస్ హెడ్(17), అలెక్స్ క్యారీ(19 నాటౌట్), ప్యాట్ కమిన్స్ (22)లు డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. వన్డే తరహా బ్యాటింగ్ కొనసాగిస్తే ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించవచ్చు. అయితే ఆసీస్ వ్యూహాత్మకంగా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినట్లు అర్థమవుతోంది. ఊరించే లక్ష్యాన్ని ముందు ఉంచి దెబ్బతీయాలనే వ్యూహంతో ఆసీస్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాబట్టి భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.