ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్ట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఐదో టెస్ట్ నుంచి రోహిత్ స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. దాంతో జస్ప్రీత్ బుమ్రా సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
జట్టు మేలు కోరే రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడని టాస్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. 'ఈ సిరీస్లో మేం అద్బుతమైన క్రికెట్ ఆడాం. గత మ్యాచ్ చాలా ఉత్సాహంగా సాగింది. ఈ మ్యాచ్లో మేం మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాం. పిచ్పై కాస్త గడ్డి ఉంది. కొత్త బంతితో బ్యాటర్లకు సవాల్ ఎదురవ్వనుంది.

మా కెప్టెన్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండి తన నాయకత్వ పటిమను చాటుకున్నాడు. నిస్వార్థంగా జట్టు మేలు కోరి ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకోగా.. ఆకాశ్ దీప్ గాయంతో తప్పుకున్నాడు. అతని స్థానంలో ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.'అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.
కెప్టెన్ మారినా.. టీమిండియా ఆటతీరు మాత్రం మారలేదు. అదే తడబాటు కొనసాగుతోంది. తొలి సెషన్లోనే టీమిండియా మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ నిప్పులు చెరగడంతో భారత బ్యాటర్లు క్రీజులో నిలబడేందుకు ఇబ్బంది పడ్డారు. కేఎల్ రాహుల్(4)ను మిచెల్ స్టార్క్ ఔట్ చేయగా.. యశస్వి జైస్వాల్(10)ను స్టన్నింగ్ డెలివరీతో స్కాట్ బోలాండ్ పెవిలియన్ చేర్చాడు. కోహ్లీతో కలిసి ఆచితూచి ఆడిన శుభ్మన్ గిల్.. తొలి సెషన్ ఆఖరి బంతికి నాథన్ లయన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దాంతో భారత్ 57/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. క్రీజులో విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్ ఉన్నాడు.
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కోన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్.