ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సారథిగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించడం ఖాయమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు నిరాకరించడంతో బుమ్రానే సారథిగా వ్యవహరిస్తాడనే విషయం స్పష్టమైంది.
సెప్టెంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండనని రోహిత్ శర్మ బీసీసీఐకి సమాచారమిచ్చాడు. తన సతీమణి డెలవరీ సమయంలో పక్కనే ఉండేందుకు హిట్ మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే నవంబర్ 15న రోహిత్ శర్మ సతమీణి రితికా సజ్దేకు రెండో సంతానంగా పండంటి మగబిడ్డ జన్మించాడు. దాంతో రోహిత్ శర్మ తొలి టెస్ట్కు అందుబాటులో వస్తాడని ప్రచారం జరిగింది. నవంబర్ 18నే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కుతాడని వార్తలు వచ్చాయి. దాంతో తొలి టెస్ట్ కెప్టెన్ ఎవరా? అనేదానిపై గందరగోళం నెలకొంది.
కానీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు రోహిత్ శర్మ నిరాకరించడంతో.. బుమ్రానే కెప్టెన్గా కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. మరో స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ గాయపడటంతో రాహుల్కు మార్గం సుగుమమైంది.
మరోవైపు సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ ఐదు టెస్ట్ల సిరీస్ మొత్తానికి బుమ్రానే సారథిగా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచిస్తున్నారు. అయితే రెండో టెస్ట్కు రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అతను జట్టులోకి వస్తే మాత్రం కెప్టెన్గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఈ ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవడం భారత్కు కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే టీమిండియా ఈ సిరీస్ను 4-0తో కైవసం చేసుకోవాలి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా చిత్తయ్యింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టీమిండియా మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్కు గురైంది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్కు ఇజ్జత్కే సవాల్గా మారింది.