
జట్టులో ఇషాన్ కిషన్..
బ్యాటింగ్ వైఫల్యంతో మూడో టెస్ట్లో ఓడిన టీమిండియా.. ఆ బలగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి మూడు టెస్ట్ల్లో విఫలమైన కేఎస్ భరత్ను పక్కనపెట్టి యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను ఆడించాలనుకుంటోంది. ఈ మ్యాచ్కు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్తో కూడిన పిచ్లను సిద్దం చేస్తోంది. బీసీసీఐ, టీమ్మేనేజ్మెంట్ కోరుకున్నట్లు పిచ్ను ఖరారు చేయనుంది. రెడ్ సాయిల్ పిచ్ టర్నింగ్కు అనుకూలంగా ఉండనుండగా.. బ్లాక్ సాయిల్ బ్యాటింగ్కు సహకరించనుంది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం బ్లాక్ సాయిల్ వికెట్నే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

కేఎస్ భరత్పై వేటు..
ఇక కేఎస్ భరత్ గత మూడు మ్యాచ్ల్లో ఐదు ఇన్నింగ్స్లు ఆడి 57 పరుగులు మాత్రమే చేశాడు. 8,6, 23 నాటౌట్, 17, 3 దారుణంగా విఫలమయ్యాడు. పంత్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడు. కీపర్గా అదరగొడుతున్నా బ్యాటింగ్లో విఫలమయ్యాడు. అయితే అహ్మదాబాద్ వికెట్లో అంతగా టర్న్ లేకుంటే ఇషాన్ కిషన్ను ఆడించాలని టీమ్మేనేజ్మెంట్ భావిస్తుంది. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్లకు ఇషాన్ ఇబ్బంది పడుతాడు. దూరంగా వెళ్తూ టర్న్ అయ్యే బంతులను అతను ఆడలేడు.

ద్రవిడ్తో ప్రాక్టీస్..
ప్రాక్టీస్ సెషన్లో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్తో పాటు కీపింగ్ ప్రాక్టీస్ చేయడం,హెడ్ కోచ్ ప్రత్యేక శ్రద్ద చూపడంతో అతను తుది జట్టులోకి వస్తాడనే ప్రచారం ఊపందకుంది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అనుభవం ఉండటంతో పాటు అటాకింగ్ గేమ్ ఆడగలిగే సత్తా ఇషాన్ కిషన్కు ఉండటం జట్టుకు కలిసొస్తుందని టీమ్మేనేజ్మెంట్ భావిస్తోంది. తన అటాకింగ్ గేమ్తో 30-40 పరుగులు చేసినా జట్టుకు ఉపయోగపడుతాయని సమాలోచనలు చేస్తోంది. అయితే సుదీర్ఘ ఫార్మాట్లో కీపింగ్ చేసిన అనుభవం అతనికి లేకపోవడం ప్రతికూలంగా మారింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం..
మరోవైపు భరత్కు అండగా రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశమైంది. భరత్ గురించి తాము ఆందోళన చెందడం లేదని రాహుల్ తెలిపాడు. భరత్ ఎదుర్కొన్న సవాళ్లు, అతడు ఆడిన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న ద్రవిడ్.. ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో అతడు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ.. తన వంతుగా 17 పరుగులు చేశాడన్నాడు. ఢిల్లీ టెస్ట్లోనూ రాణించాడని పేర్కొన్నాడు. అయితే ద్రవిడ్ వ్యాఖ్యలు ఇలా ఉన్నా.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్ వేదికగా జరగనుండటంతో ఇషాన్తో కీపింగ్ చేయించడం ఉత్తమమని కెప్టెన్ రోహిత్ శర్మ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై ఇషాన్ కిషన్ లాంటి కీపర్ జట్టులో ఉండాలని, ఆ మ్యాచ్ కోసమైనా.. చివరి టెస్ట్లో ఇషాన్ను ఆడించాలనేది టీమిండియా వ్యూహంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












