న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సలహా ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాలని సూచించాడు. లేకుంటే మొదటికే మోసం వస్తుందని, వారి బౌలింగ్లో వికెట్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని కోహ్లీని హెచ్చరించాడు. ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ.. వన్డేల్లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అయితే టెస్ట్లో సెంచరీ నిరీక్షణకు విరాట్ తెరదించాల్సి ఉంది. 2019లో బంగ్లాదేశ్పై చివరిసారిగా సెంచరీ చేసిన విరాట్.. మళ్లీ టెస్ట్ శతకాన్ని అందుకోలేకపోయాడు.
టీ20, వన్డేల్లో సెంచరీలు సాధించిన విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నప్పటికీ స్పిన్కు కాస్త తడబడుతున్నాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో స్పిన్ ఆడలేకనే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే స్పిన్ను ఎదుర్కోవడంపై విరాట్కు పఠాన్ సలహా ఇచ్చాడు. ఆసీస్ స్పిన్నర్లను డిఫెన్స్ మోడ్లో కాకుండా అటాకింగ్ చేయాలని చెప్పాడు. అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన పఠాన్.. ఆసీస్ స్పిన్నర్లు నాథన్ లియోన్, అష్టన్ అగర్ బౌలింగ్లో ఎదురుదాడికి దిగాలని సూచించాడు.
'స్పిన్ను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై విరాట్ దృష్టి సారించాలి. ముఖ్యంగా లియోన్, అగర్ బౌలింగ్ను ఆడటంపై ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగాలి. ఎందుకంటే విరాట్ స్పిన్కు తడబడుతున్నాడు. నా ఆలోచన ప్రకారం ఈ ఇద్దరి బౌలర్లపైకి ఎదురు దాడికి దిగడమే ఉత్తమం. స్పిన్నర్లపై విరాట్ స్ట్రైక్రేట్ చాలా తక్కువగా ఉంది.
టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ కొన్నిసార్లు స్పిన్నర్లపై అటాకింగ్ గేమ్ ఆడటమే విరాట్ కోహ్లీకి మంచిది. అసాధారణ స్పిన్ బౌలర్ అయిన నాథన్ లియోన్ ఎదుర్కోవాలంటే విరాట్కు ఉన్న ఏకైక మార్గం ఇదే. ఎక్స్ట్రా బౌన్స్ ఉండటంతో రైట్ హ్యాండర్స్ దూరంగా బంతి మూవ్ అవుతూ వెళ్లూ ఉంటుంది. ఈ విషయాన్ని విరాట్ దృష్టిలో పెట్టుకోవాలి. శరీరానికి దగ్గరగా వచ్చే బంతులనే ఆడాలి.'అని పఠాన్ సూచించాడు.