
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 21/0 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు నాథన్ లయన్ షాకిచ్చాడు. వరుసగా తన రెండు ఓవర్లలో టీమిండియా టాప్-3 వికెట్లను పడగొట్టాడు. ముందుగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న కేఎల్ రాహుల్(17) ఎల్బీగా పెవిలియన్ చేర్చి తొలి వికెట్కు నమోదైన 46 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదంతో పాటు ఆస్ట్రేలియా రివ్యూ తీసుకోకపోవడం పుజారాకు కలిసొచ్చింది. అంపైర్ ఔటిచ్చినా.. ఆసీస్ రివ్యూ తీసుకున్న పుజారా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అప్పటికే రెండు రివ్యూలను వృథా చేసుకున్న ఆసీస్.. మరో సమీక్ష తీసుకోవడానికి దైర్యం చేయలేకపోయింది.
తన మరుసటి ఓవర్లో లయన్ స్టన్నింగ్ డెలివరీతో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. లయన్ వేసిన క్వికర్ టర్న్ బాల్ను రోహిత్ అంచనా వేయలేకపోయాడు. దాంతో బ్యాక్ఫుట్లో ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్, ప్యాడ్ గ్యాప్లో నుంచి దూసుకెళ్లిన బంతి వికెట్లను పడగొట్టింది. ఫ్రంట్ ఫుట్లో ఆడాల్సిన బంతిని బ్యాక్ ఫుట్లో ఆడటం రొహిత్ ఔట్కు కారణమైంది.
అదే ఓవర్ నాలుగో బంతికి చతేశ్వర్ పుజారా(0) వికెట్ల ముందు దొరికిపోయాడు. మరోసారి అంపైర్ ఔటివ్వకపోగా.. ఈ సారి ఆసీస్ ఎలాంటి తప్పు చేయలేదు. కాన్ఫిడెన్స్తో రివ్యూకెళ్లి ఫలితం సాధించింది. రిప్లేలో బంతి ముందుగా ప్యాడ్ను తాకిన తర్వాత బ్యాట్ తాకినట్లు తేలడంతో పుజారా వెనుదిరగక తప్పలేదు. అంపైర్ తప్పిదంతో వచ్చిన అవకాశాన్ని పుజారా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న పుజారా(0).. తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.