
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో టెస్ట్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్ట్లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 115 పరుగులతో లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 26.4 ఓవరల్లో 4 వికెట్లకు 118 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
కేఎల్ రాహుల్(1), శ్రేయస్ అయ్యర్(12) విఫలమైనా.. రోహిత్ శర్మ(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), చతేశ్వర్ పుజారా(74 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) రాణించారు. విరాట్ కోహ్లీ(31 బంతుల్లో 3 ఫోర్లతో 20), కేఎస్ భరత్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ రెండు వికెట్లు తీయగా.. టాడ్ ముర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు. లేని పరుగుకు ప్రయత్నించి రోహిత్ శర్మ రనౌటయ్యాడు.
అంతకుముందు 61/1 ఓవర్నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. 31.1 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(7/42) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్కు అశ్విన్ (3/59) మూడు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ తొలి సెషన్లోనే ముగిసింది. ట్రావిస్ హెడ్(45), మార్నస్ లబుషేన్(35) రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. గింగిరాలు తిరిగిన పిచ్పై ఆసీస్ బ్యాటర్లు అటాకింగ్గా ఆడి మూల్యం చెల్లించుకున్నారు. ముఖ్యంగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడబోయి వికెట్లు పారేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ 1 పరుగు ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 115 పరుగుల లక్ష్యం నమోదైంది.
ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులు చేయగా.. టీమిండియా 262 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(115 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 74) అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియా గట్టెక్కింది. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగిన భారత ఇన్నింగ్స్ను అక్షర్ అసాధారణ బ్యాటింగ్తో నిలబెట్టాడు. మరో స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(71 బంతుల్లో 5 ఫోర్లతో 37)తో కలిసి 8వ వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్సే మ్యాచ్ను మలుపు తిప్పింది. ఈ విజయంతో నాలుగు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది.