ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమైంది. శుక్రవారం (జనవరి 3) నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న ఐదో టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. గత నాలుగు టెస్ట్ల్లో ఒక మ్యాచ్ గెలిచి.. మరో రెండు మ్యాచ్లు ఓడిన టీమిండియా.. గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.
మెల్ బోర్న్ టెస్ట్లో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రా చేసుకునే అవకాశం ఉన్నా టీమిండియా బ్యాటర్లు విఫలమవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు కూడా సంక్లిష్టమయ్యాయి. అంతేకాకుండా ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఆఖరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా భావిస్తోంది.

మరోవైపు అసాధారణ ఆట తీరుతో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ ఆఖరి టెస్ట్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దాంతో సిడ్నీ టెస్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభం కానుంది.
జియోసినిమాలో రాదు..
ఈ ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్ కాస్టర్గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్కు చెందిన ఛానెల్స్తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్స్టార్లో ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ హెచ్డీ ఛానెల్లతో పాటు స్టార్ స్పోర్ట్స్ 4 తెలుగు, మళయాళం, కన్నడ వంటి స్థానిక భాషాల్లోనూ లైవ్ రానుంది.
అయితే ఈ ఛానెల్స్ను సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. హాట్ స్టార్లో కూడా ఈ సిరీస్ ఫ్రీగా రాదు. డబ్బులు చెల్లించాల్సిందే. జియోసినిమాలో ఫ్రీగా మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో హాట్ స్టార్ కూడా దిగొచ్చి కొన్నిరోజులు ఫ్రీగా లైవ్ ఇచ్చింది. కానీ ఈ రెండు సంస్థలు వ్యాపార భాగస్వాములుగా మారడంతో గత కొన్ని రోజులుగా హాట్ స్టార్ ఫ్రీగా మ్యాచ్లు ప్రసారం చేయడంలేదు. దాంతో అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ ఛానెల్లో ఫ్రీ..
మరోవైపు భారత క్రికెట్ అభిమానుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించింది. ఈ ఛానెల్ను ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ను కూడా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (295 పరుగుల తేడాతో భారత్ గెలుపు)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (10 వికెట్లతో ఆసీస్ గెలుపు)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (డ్రా)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్ (184 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపు)
జనవరి 03-07: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)
భారత జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.
మూడో టెస్ట్కు భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్