ఐదు టెస్ట్ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ గమనాన్ని నిర్ణయించే కీలకమైన మూడో టెస్ట్లో టీమిండియా తడబడుతోంది. గత రెండు టెస్ట్ల తరహాలోనే పేలవ బ్యాటింగ్తో పాటు చెత్త బౌలింగ్తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేసిన పిచ్పై భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
యశస్వి జైస్వాల్(4), శుభ్మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(3), రిషభ్ పంత్(9) తీవ్రంగా నిరాశపర్చడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 17 ఓవర్లలో 4 వికెట్లకు 51 పరుగులే చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(31 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(0 బ్యాటింగ్) ఉన్నాడు.

పదే పదే అంతరాయం కలిగించడంతో సోమవారం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు. అంతకుముందు 405/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఓవర్నైట్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(88 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీ సాధించగా.. మిచెల్ స్టార్క్(18) త్వరగానే ఔటయ్యాడు. స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 12 ఫోర్లతో 101), ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 18 ఫోర్లతో 152) సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(6/76) ఆరు వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్(2/97) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్పై ఆసీస్ పూర్తి పట్టు సాధించింది. వర్షం అంతరాయం కలిగించకుండా చివరి రెండు రోజుల పాటు ఆట సజావుగా సాగితే ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే సిరీస్పై పట్టు చిక్కనుంది. అంతేకాకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫైనల్ అవకాశాలు మెరుగవనున్నాయి.
ఈ మ్యాచ్ను భారత్ డ్రా చేసుకోవాలన్నా.. ఓటమి తప్పించుకోవాలన్నా ముందుగా ఫాలో ఆన్ గండం తప్పించుకోవాలి. అందుకోసం భారత్ తొలి ఇన్నింగ్స్లో కనీసం 246 పరుగులు చేయాలి. ఇప్పటికే 51 పరుగులు చేయడంతో మరో 195 పరుగులు చేస్తే టీమిండియా ఫాలో ఆన్ గండం గట్టెక్కుతోంది.
క్రీజులో ఉన్న రోహిత్, కేఎల్ రాహుల్తో పాటు తర్వాతి బ్యాటర్లు నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ భాగస్వామ్యం నెలకొల్పితేనే ఇది సాధ్యమవుతోంది. ఎందుకంటే టెయిలెండర్లపై నమ్మకం పెట్టుకోలేం. అంతేకాకుండా నాలుగో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తేనే.. ఈ మ్యాచ్లో భారత్ ఓటమి తప్పించుకోగలదు. లేకుంటే మరో ఘోర పరాజయం తప్పదు.