ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ను టీమిండియా డ్రా చేసుకుంది. టెయిలెండర్ల అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఫాలో ఆన్ తప్పించుకున్న టీమిండియా.. వరణుడి సాయంతో ఈ మ్యాచ్లో ఓటమిని తప్పించుకుంది. ఈ సిరీస్కు కీలకమైన ఈ మ్యాచ్ డ్రా కావడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో సౌతాఫ్రికా(63.33 శాతం) అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా(58.89 శాతం), భారత్(55.88 శాతం) రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గబ్బా టెస్ట్లో భారత ఓడి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. డ్రాతో గట్టెక్కడంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది.

3-1తో గెలిస్తేనే ఫైనల్ బెర్త్..
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లకు రెండు భారత్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం అవుతోంది. అప్పుడు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుంది.
2-1తో గెలిస్తే..
ఒకవేళ చివరి రెండు మ్యాచ్ల్లో ఒకటి డ్రా చేసుకొని 2-1తో సిరీస్ కైవసం చేసుకుంటే మాత్రం ఇతర సిరీస్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండు టెస్ట్ల సిరీస్ ఫలితం భారత అవకాశాలను శాసిస్తోంది. ఈ సిరీస్ను శ్రీలంక 1-0తో గెలవడం లేదా 1-1తో సమం చేసుకుంటేనే భారత్కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కుతోంది.
2-2తో సమం చేసుకుంటే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-2తో సమం చేసుకుంటే అప్పుడు టీమిండియా పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. శ్రీలంక 2-0తో ఆసీస్ను క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పాకిస్థాన్ 2-0తో సౌతాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది.