ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టెస్ట్ ఆడుతోంది. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా శనివారం ఈ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే వర్షం కారణంగా తొలి రోజు 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(19 బ్యాటింగ్), నాథన్ మెక్స్వీనీ(4 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు.

గబ్బా టెస్ట్కు వరుణ గండం..
రెండో రోజు ఆటకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. రెండో రోజే కాదు ఈ మ్యాచ్ మొత్తం వర్షం కారణంగా రదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిస్బేన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్ రెండో రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 100 శాతం వర్షం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మూడో రోజు 46 శాతం, నాలుగో రోజు 67 శాతం, ఐదో రోజు 68 శాతం వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మ్యాచ్ రద్దయితే..?
అయితే ఈ మ్యాచ్ రద్దయితే వలర్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఒక వేళ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయినా లేక.. ఫలితం లేకుండా ముగిసినా.. తదుపరి రెండు మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించాల్సి ఉంటుంది. చివరి రెండు మ్యాచ్లకు రెండు గెలిస్తే టీమిండియా ఈ సిరీస్ను 3-1తో కైవసం చేసుకోనుంది. అప్పుడు ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా ఫైనల్ చేరనుంది.
2-1తో గెలిస్తే..
అలా కాకుండా చివరి రెండు మ్యాచ్ల్లో ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్ ఒకటి గెలిచి మరొకటి డ్రా చేసుకొని ఈ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంటే.. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్ట్ల సిరీస్లో శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాల్సి ఉంటుంది. ఈ సిరీస్ జనవరి-ఫిబ్రవరి మధ్య జరగనుంది.
2-2తో సమమైతే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్ట్ల్లో ఆసీస్ ఒక్కటి గెలిచినా.. టీమిండియా దాయదీ పాకిస్థాన్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్ల సిరీస్ను పాక్ 2-0తో గెలవాల్సి ఉంటుంది. అలా జరిగితేనే భారత్ ఫైనల్ చేరుతోంది. లేదంటే శ్రీలంక.. ఆస్ట్రేలియాను 2-0తో క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది.