
ముంబై: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉంటుందనే ఏకైక కారణంతోనే ఫీల్డింగ్ ఎంచుకుంటున్నానని టీమిండియా తాత్కలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తెలిపాడు. బామ్మర్ది పెళ్లి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరం కాగా.. వైస్ కెప్టెన్ హోదాలో హార్దిక్ పాండ్యా జట్టును నడిపిస్తున్నాడు. ముంబై వికెట్పై సెకండ్ ఇన్నింగ్స్ ఆడటం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పిన హార్దిక్.. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి దిగడం సంతోషంగా ఉందన్నాడు.
ఈ విరామాన్ని తన ఆటను మెరుగుపర్చుకునేందుకు, ఫిట్గా తయారయ్యేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు. భారత్ తరఫున ప్రతీ మ్యాచ్, ప్రతీ ఫార్మాట్ ఆడటం ముఖ్యమేనని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో 50 ఓవర్ల ఫార్మాట్ మరింత కీలకంగా మారిందన్నాడు. నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
తనతో పాటు శార్దూల్ ఠాకూర్ పేస్ బాధ్యతలతో పాటు లోయరార్డర్ బ్యాటింగ్ బాధ్యతలు మోస్తాడని చెప్పాడు. గాయం తర్వాత రవీంద్ర జడేజా ఆడుతున్న తొలి వన్డే ఇదే. న్యూజిలాండ్తో సిరీస్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. యుజ్వేంద్ర చాహల్ బెంచ్కే పరిమితమయ్యాడు. జడేజా పునరాగమనంతో సుందర్, అక్షర్కు మొండిచెయ్యి ఎదురైంది.
మరోవైపు టాస్ ఓడిపోవడమే మంచిదైందని ఆసీస్ తాత్కలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) అన్నాడు. టాస్ గెలిస్తే ఏం ఎంచుకోవాలనేదానిపై తనకు క్లారిటీ లేదన్న స్మిత్.. వీలైనంత మేరకు ఈ పరిస్థితులను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకొని తమ కాంబినేషన్ను ఎంపిక చేసామన్నాడు.
బీజీటీ సిరీస్లో చివరి రెండు మ్యాచ్ల్లో సత్తా చాటామని, అదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అలెక్స్ క్యారీ కాస్త అస్వస్థతకు గురవ్వడంతో స్వదేశం వెళ్లాడని, అతని స్థానంలో జోష్ ఇంగ్లీస్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. డేవిడ్ వార్నర్ కూడా ఇంకా ఫిట్ కాలేదని, అతని స్థానంలో మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లీస్(కీపర్), కామెరూన్ గ్రీన్, గ్లేన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయనీస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
భారత్: శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్(కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ.