ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు అగ్ని పరీక్షగా మారింది. ఈ సిరీస్లో టీమిండియా ఓడిపోతే అతని ఇమేజ్ డ్యామేజ్ అవ్వనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా మీడియా.. గంభీర్పై మాటల తూటాలు పేల్చుతోంది.
భారీ అంచనాలతో గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోదని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు సరైన వారసులను కూడా ఎంపిక చేస్తాడని భావించారు. కానీ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియాకు ఊహించని పరాజయాలు ఎదురయ్యాయి.

గంభీర్ ఏ మూహార్తనా టీమిండియాకు కోచ్గా మారాడో కానీ, భారత జట్టు చరిత్రలో ఎప్పుడూ చూడని పరాజయాలను చవి చూస్తోంది. ఎవరూ ఊహించని విధంగా శ్రీలంక గడ్డపై టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
మూడు వన్డేల సిరీస్ను 0-2తో కోల్పోయింది. శ్రీలంక స్పిన్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత టీమిండియాపై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచింది.
ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో 0-3తో క్లీన్ స్వీప్ అయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ వరుస పరాజయాల నేపథ్యంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. గంభీర్ ఇజ్జత్కే సవాల్గా మారింది. ఈ సిరీస్ను కోల్పోయినా.. గంభీర్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే భారత్ కనీసం రెండు టెస్ట్ల్లోనైనా విజయం సాధించాలి.

గంభీర్ పని తీరుపై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గంభీర్ సామర్థ్యానికి పరీక్ష అన్నాడు. ఈ సిరీస్లో గంభీర్ సహనాన్ని పరీక్షిస్తుందని చెప్పాడు.
'పెద్ద జట్టుకు నాయకత్వం వహించడం అంత సులువైన పనికాదు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఫలితం అనుకూలంగా ఉంటే అందరూ అభిమానిస్తారు. గంభీర్ సహనానికి ఈ సిరీస్ పరీక్షగా నిలుస్తోంది. ఈ సిరీస్ ఫలితం అనుకూలంగా లేకుండా గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాడు.'అని హర్భజన్ సింగ్ హెచ్చరించాడు.