ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. చీలమండ గాయంతో దాదాపు ఏడాదిగా జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ.. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్దమయ్యాడు.
మధ్యప్రదేశ్తో బుధవారం జరిగే ఐదో రౌండ్ రంజీ మ్యాచ్లో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. వాస్తవానికి కర్ణాటకతో జరిగిన నాలుగో రౌండ్ రంజీ మ్యాచ్లోనే షమీ బరిలోకి దిగాల్సింది. కానీ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో సాధ్యం కాలేదు.

ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకొని మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన షమీ.. బెంగాల్ తరఫున ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడు. రంజీ ట్రోఫీలో అతను రిథమ్ అందుకొని మునపటిలా సత్తా చాటితే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కుతాడు. సిరీస్ మధ్యలోనైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతాడు.
గతేడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగిన మహమ్మద్ షమీ.. చీల మండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దాంతో గతేడాదిగా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ లేదా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ ఈ రెండు సిరీస్లకు అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మహమ్మద్ షమీ రిహాబిలిటేషన్ పూర్తి చేసుకొని ఫిట్నెస్ టెస్ట్ కూడా పాసయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చే ముందు దేశవాళీ క్రికెట్ ఆడుతానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడి సత్తా చాటి.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతానని చెప్పాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా స్పష్టం చేశాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు. అతని విషయంలో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. తొందరపాటు పడకుండా గాయం పూర్తిగా తగ్గి మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి తీసుకోవాలనుకుంటోంది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా ఐదు టెస్ట్ల బోర్డర గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రంజీల్లో షమీ చెలరేగితే.. ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్ట్లు అయినా ఆడే అవకాశం ఉంది.