టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్గ్రాత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని కొనియాడాడు. అతని అసాధారణమైన బౌలింగ్తోనే ఈ సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అభిప్రాయపడ్డాడు. బుమ్రానే లేకుంటే ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు మరింత ఏకపక్షంగా మారేదన్నాడు.
ఈ సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో బుమ్రా 30 వికెట్లు పడగొట్టాడు. మరే బౌలర్ కూడా 17 వికెట్లు తీయలేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో అసాధారణ బౌలింగ్తో చారిత్రాత్మక విజయాన్నందించాడు. తర్వాతి మూడు టెస్ట్ల్లోనూ బుమ్రా బంతితో చెలరేగాడు. కానీ ఇతర ఆటగాళ్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్తో మాట్లాడిన మెక్గ్రాత్.. బంతిపై నియంత్రణ, సామర్థ్యం, పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంపై బుమ్రా నైపుణ్యం గొప్పగా ఉందని ప్రశంసించాడు.

'భారత జట్టు ప్రధాన బలం జస్ప్రీత్ బుమ్రా. అతనే లేకుంటే ఈ సిరీస్ మరింత ఏకపక్షంగా సాగేది. అతని ప్రదర్శన అత్యుద్భుతంగా ఉంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో బుమ్రాది ప్రత్యేకమైన నైపుణ్యం. తక్కువ రనప్తోనే బంతికి ఎంతో వేగాన్ని జోడిస్తున్నాడు. బంతిని రెండు వైపులా బాగా నియంత్రిస్తున్నాడు. అతన్ని భారత్ అద్భుతంగా వాడుకుంటోంది. బుమ్రాకు నేను డై హార్డ్ ఫ్యాన్'అని మెక్గ్రాత్ చెప్పుకొచ్చాడు.
ఐదు టెస్ట్ల సిరీస్లో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా భారీ విజయం సాధించింది. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. గబ్బా వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో వర్షంతో ఓటమిని తప్పించుకుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్లో భారత్ డ్రా కోసం ఆఖరి వరకు పోరాడింది. ఇరు జట్ల మధ్య చివరి టెస్ట్ శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే ఈ సిరీస్ సమం కావడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.